బీసీ చట్టం.. లోకేష్ అభయ హస్తం

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజున కొనసాగుతోంది. సెల్ఫీ విత్ లోకేష్ తో ప్రారంభమయ్యే రోజువారీ కార్యక్రమం తర్వాత  కనీసం మూడు నాలుగు మీటింగులతో కొనసాగుతోంది మైనార్టీలు, బీసీలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వచ్చి లోకేష్ ను కలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్..  అధికారానికి రాగానే  అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు.  పాలిచ్చే  ఆవును తరిమేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నందునే ఈ సమస్య వచ్చిందని  లోకేష్ అంటున్నారు.

టీడీపీ బీసీల పార్టీ అని, అన్న నందమూరి తారకరామారావు బీసీలకు పెద్ద  పీట వేశారని లోకేష్ గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో రజకులు, గీత కార్మికులు, పద్మశాలీలు,జాలర్లు ఇలా అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్పొరేషన్ల నిధులను స్వాహా చేశారని, టీడీపీ హయాంలో  మంజూరు చేసిన నిధులను కూడా ఆపేశారని  ఆయన గుర్తు చేస్తున్నారు..

వైసీపీ నేతలు ఎస్సీ, ఎస్టీలపైనా…బీసీలపైనా  దాడులు చేస్తున్నారన్నారు.  బీసీ సామాజిక వర్గాలకు భద్రత లేకుండా పోయిందని  లోకేష్ గుర్తు చేస్తున్నారు.  మాట్లాడిన ప్రతీ చోట ఎవరెవరిపై, ఎక్కడ దాడి జరిగిందో చెబుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీల భద్రతకు చట్టం ఉన్నట్లే  బీసీల భద్రతకు కూడా ఒక చట్టం తీసుకు వస్తామని లోకేష్ తెలిపారు. అధికారానికి  వచ్చిన వెంటనే బీసీల భద్రతా చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెడతామన్నారు. అప్పుడు బీసీలపై దాడులు చేసిన వారికి కఠిన  శిక్షలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు..

లోకేష్  తొందరపడి  ఇలాంటి  ప్రకటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు  ఆందోళన చెందుతున్నాయి. ఇదీ వైసీపీకి లీకులు ఇచ్చినట్లే అవుతుందని అంటున్నాయి. లోకేష్ ప్రకటనలతో అప్రమత్తమైన వైసీపీ ప్రభుత్వం తామే ఆ చట్టాన్ని తీసుకువచ్చి లబ్ధి పొందే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి. అందుకే కొన్ని వ్యూహాలు గోప్యంగా ఉంచడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి..