ఇంటి గుట్టు బ‌య‌ట‌కు.. ఇప్పుడేం చెబుతావు జ‌గ‌నన్నా!!

టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మంగా కేసులు పెడుతున్నారంటూ.. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిని వైసీపీ నాయ‌కులు ఖండిస్తున్నారు. తాము ఎవ‌రిపైనా అక్ర‌మంగా కేసులు పెట్ట‌డం లేద‌ని చ‌ట్టం ప్ర‌కార‌మే పోలీసులు ప‌నిచేస్తున్నార‌ని కూడా వారు చెబుతున్నారు. అయితే.. తాజాగా ఇంటి గుట్టు బ‌య‌ట ప‌డింది. టీడీపీ నేత‌ల‌పై పోలీసులు పెడుతున్న కేసులు కేవ‌లం వైసీపీ నేత‌ల ఒత్తిళ్ల‌తోనేని.. దీని వెనుక రాజ‌కీయ ప్ర‌లోభాలు ఉన్నాయ‌ని.. వైసీపీకే చెందిన కీల‌క నేత ఒక‌రు.. మాట్టాడిన ఆడియో టేపు ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

ఏం జ‌రిగిందంటే.
ఈ నెల 13న జ‌రిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు బలవంతంగా అక్రమ కేసులు పెట్టించారని వైసీపీ కార్యకర్త మాట్లాడుతున్న ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఏర్పేడు జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొన్న వివాదంలో.. పాత వీరాపురానికి చెందిన వైసీపీ కార్యకర్త దామోదరరెడ్డి గాయపడినట్టు ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అదే రోజు దామోదర్‌ రెడ్డి, మరో వ్యక్తితో కలిసి పోలీసు స్టేషన్‌లో SC…ST దాడి కేసులు నమోదు చేశారు. దీంతో భయాందోళనకు గురైన టీడీపీ నేతలు రహస్య ప్రాంతాలోకి వెళ్లారు.

అయితే వైసీపీ నేతలు తన దగ్గర నుంచి ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించారని.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని దామోదర్‌ రెడ్డి టీడీపీ నేతతో మాట్లాడుతున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. అందులో వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేయటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మ‌రి దీనిపై జ‌గ‌న్ కానీ, స‌ల‌హాదారులు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.