అమ‌రావ‌తి కేసు.. స‌ర్కారుపై సుప్రీం ఆగ్ర‌హం

అమ‌రావతి రాజ‌ధాని విష‌యంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ.. ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ విష‌యంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. “ఎందుకంత తొంద‌ర ప‌డుతున్నారు? దానిలో మీ వ్య‌క్తి గ‌త ప్ర‌యోజ‌నాలు లేవుక‌దా.. ఉంటే చెప్పండి!” అని ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదుల‌నుఉద్దేశించి.. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్త‌వానికి సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి కేసు విచార‌ణ‌కు రావాల్సి ఉంది. ఈ కేసుకు కోర్టురిజిస్ట్రీ 10వ నెంబ‌రు కేటాయించారు.

అయితే.. 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతుండగా ధర్మాసనం ముందు అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ న్యాయవాదులు ప్రయత్నించారు. దీంతో జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. అమరావతి పిటీషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ఏపీ తరపు సీనియర్ న్యాయవాదులు నఫ్డే, నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఒక కేసు సగం విచారణలో ఉండగా మరో కేసు ఎలా విచారించాలి..? అసలు ఎందుకు ఇంత తొంద‌ర ప‌డుతున్నారు? మీ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? అని న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా.. మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ లాయర్లు మిన్నకుండిపోయారు. కాగా.. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారడంతో అమరావతి కేసుపై విచారణ ఆలస్యమైంది. మొదటి 5 కేసుల విచారణ తర్వాత 12వ నెంబర్ నుంచి 20 నెంబర్ కేసు వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెంబర్ కేసు నుంచి 11వ నెంబర్ కేసు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 21 నుంచి 39, 41వ నెంబర్ కేసులను కోర్టు విచారిస్తుంది. ప్రస్తుతం 10వ నెంబర్ కేసుగా అమరావతి రాజధాని కేసు ఉంది.

సుదీర్ఘ వాయిదా..

అమరావతి రైతుల పిటిషన్‌‌తో పాటు ప్రభుత్వం పిటిషన్‌పై విచారణను జులై 11కి ధర్మాసనం వాయిదా వేసింది. ప్రభుత్వం తరపు పిటిషన్‌ను జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదన్న ఏపీ తరపు సీనియర్ కౌన్సిల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అయితే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16న జస్టిస్ కె ఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.