కన్నా విందు రాజకీయం

మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరిన తర్వాత యమ యాక్టివ్ అయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా పోటీ చేయాల్సిన నియోజకవర్గంపై సందిగ్ధత ఏర్పడటంతో ఆయన ఇప్పుడు జిల్లాలో అందరినీ మంచి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన గుంటూరు వెస్ట్, పెదకూరపాడు లేదా సత్తెనపల్లిలో పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో ఒక నియోజకవర్గాన్ని అధిష్టానం కేటాయిస్తుందని తెలియడంతో ఆయా ప్రాంతాల నేతలతో పాటు జిల్లాలోని అందరు తెలుగు దేశం నేతలను కన్నా టచ్ చేస్తున్నారు.

ఇప్పడు వచ్చిన నేత అన్న ముద్ర పడకుండా ఉండేందుకు కన్నా ప్రయత్నిస్తున్నారు. కన్నా టీడీపీ నేతలకు విందు ఇచ్చారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని కన్నా అనుచరులు ఆత్మీయ సమావేశం అని పిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రవణ్ కుమార్, అశోక్ బాబు, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, దారపనేని నరేంద్ర, వైవీ ఆంజనేయుడు సహా పలువురు పాల్గొన్నారు.

వైసీపీపై ఉమ్మడి పోరాటం నిర్వహిద్దామని కన్నా ప్రతిపాదించగా అందుకు నేతలంగా ఆమోదముద్ర వేశారు. వైసీపీ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జనాన్ని వేధిస్తున్న విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలనుకున్నారు. ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు కన్నా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిజానికి జిల్లాలో కన్నా పాపులర్ లీడరే.

కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. దానితో ఇప్పుడేమైనా వ్యతిరేకత వస్తుందా అన్న కోణంలో కన్నాకు కొంత ఆందోళన పట్టుకుంది. ఎన్నికల నాటికి పార్టీలో అంతర్లీనంగా వ్యతిరేకత పెరిగితే గెలుపు కష్టమవుతుందన్న అనుమానమూ ఆయనలో కలిగింది. దానితో కన్నా అందరినీ మచ్చికచేసుకునే పనిలో ఉన్నారు. పైగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పవర్ ఫుల్ నాయకులున్నారు. వారికి ఆగ్రహం తెప్పిస్తే ఏమవుతుందో కన్నాకు తెలుసు. అందుకే ఆయన విందు రాజకీయాలు చేస్తూ అందరివాడిగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయన సక్సెస్ అవుతారో లేదో చూడాలి.