ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఎఫెక్ట్.. టీడీపీలో సంబ‌రాలు..

ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న టీడీపీ కార్యాల‌యాల్లో సంబ‌రాలు జ‌రుగుతున్నాయి. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అస‌లు పోటీ చేయ‌డ‌మే ఎక్కువ అనే స్థాయి నుంచి విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థితి కి పార్టీ చేర‌డం అంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీకి భారీ ఎత్తున ఆక్సిజ‌న్ అందించిన‌ట్టుగానే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అస‌లు ఏమాత్రం అంచ‌నాలు లేకుండా.. పార్టీ రంగంలోకి దగింది.

భారీ ఎత్తున ఓట్లు కైవ‌సం చేసుకుని పార్టీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో పార్టీ శ్రేణులు ఎక్క‌డిక‌క్క‌డ సంబ‌రాలు చేసుకుంటున్నారు. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం మంగ‌ళ‌గిరిలో అధినేత చంద్ర‌బాబు కేక్ క‌ట్ చేసి నాయ‌కుల‌కు తినిపించారు. అదేవిధంగా జిల్లాల స్థాయిలోనూ నాయ‌కులు.. పార్టీ కార్య‌కర్త‌లు సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పంచుమ‌ర్తి అనురాథ 23 ఓట్లతో విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇప్ప‌టికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడుకు మూడు స్థానాల్లోనూ వైసీపీ కోల్పోయి.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో అప్పుడు కూడా టీడీపీ సంబ‌రాల్లో మునిగిపోయారు. భారీ ఎత్తున జిల్లాల్లో కార్య‌క‌ర్త‌లు ట‌పాసులు కాల్చుకుని.. మిఠాయిలు పంచుకుని ఆనందంగా వేడుక‌లు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా.. అత్యంత కీల‌క‌మ‌ని భావిస్తున్న ఎమ్మెల్యే కోటాలోనూ విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో టీడీపీ సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి.