రెంటికి చెడ్డ రేవళ్లు..

రాజకీయాల్లో ఉన్న వారికి ఆశ ఎక్కువగా ఉంటుంది. పదవుల కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. పార్టీలు మారైనా రాజకీయంగానూ, ఆర్థికంగానూ లబ్ధిపొందాలనుకుంటారు. ప్రతీ సారి జరిగేది అదే అయినా ఈసారి ఏపీలో మాత్రం కొందరి ఆశలు ఆవిరైపోయాయి. అనుకున్నదొక్కటీ.. ఐనదొక్కటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్గాలి గిరి ఒకరు. రాజకీయంగా అవకాశం ఇచ్చిన టీడీపీని వదిలిపెటిన ఆయన. అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరారు. అయితే.. వైసీపీ వైపు వెళ్లిన మద్దాలి గిరికి ఆ పార్టీలో తగిన గుర్తింపు లేదనే ప్రచారం జరుగుతుంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా మద్దాలి గిరి ఉన్నప్పుటికీ… పెత్తనమంతా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిదే సాగుతుందని ప్రచారం స్వంత పార్టీలో ఉంది. చివరకు ఎమ్మెల్యేగా మద్దాలి గిరికి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ కూడా గౌరవం ఇవ్వడం లేదని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నరట. మద్దాలి గిరి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే.. అవమానపరుస్తున్నరని ఆ సామాజిక వర్గంలో చర్చ నడుస్తుంది. చివరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా నగరంలో వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడం.. మరింత అవమానకర పరిస్థితిగా ప్రచారం జరుగుతుంది.

మద్దాల గిరికి అధిష్టానంలో పలుకుబడి లేదని చెబుతున్నారు. లెక్కకోసం చేర్చుకుని అలా వదిలేశారని అంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలెవ్వరూ ఆయనకు సహకరించడం లేదని తేలిపోయింది. దానితో వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనని చెబుతున్నారు. అలాగని తిరిగి టీడీపీలోకి వెళ్లే పరిస్థితి కూడా లేదంటున్నారు. కష్టకాలంలో కాడి పడేసిన వారిని వెనక్కి పిలవకూడాదని చంద్రబాబు నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దానితో 2024 ఎన్నికల్లో మద్దాల గిరి పోటీ చేయడం కష్టమే కావచ్చు. పైగా ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు అంటూ జనం నినదిస్తున్న తరుణంలో ఆయన రెంటికి చెడ్డ రేవడైనట్లేననుకోవాలి.