అరెస్ట్ ప్రమాదం నుంచి కవిత బయటపడినట్లేనా

దిల్లీ లిక్కర్ కేసులో నిండా మునిగిపోయారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందని రెండు రోజులుగా ప్రచారమైనా అలాంటిదేమీ జరగకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే.. కవితను అరెస్ట్ చేయకపోవచ్చని… ఆమె విచారణ కోసం దిల్లీ వచ్చిన తొలి రోజు నుంచే కేటీఆర్, హరీశ్ రావులు కేంద్రంతో సంప్రదింపులకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని.. కవిత అరెస్ట్ ఉండదన్న హామీ లభించిందని వినిపిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ నేతలూ అదే విషయం చెప్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని.. ఈ కేసులో కవితను బీజేపీ కాపాడుతోందని మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. దేశంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు కానీ కవితను అరెస్ట్ చేయలేదని.. రెండు పార్టీలూ ఒక్కటే కాబట్టి అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించారు.

అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో విచారణ స్పీడు పెంచిందని.. దిల్లీలో రోజూ జరుగుతున్న హైడ్రామాతో ప్రజల దృష్టి అదానీ వ్యవహారం నుంచి మళ్లిపోతోందని అన్నారు మధు యాష్కీ.

ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాతో వేల కోట్లు ఆర్జించిన కల్వకుంట్ల కుటంబం ఇప్పుడు మద్యం మాఫియాలో ఎంటరైందని.. కేసీఆర్, ఆయన కొడుకు, మొత్తం పార్టీకి ఇప్పుడు కవిత వ్యవహారమే ప్రధాన సమస్యగా కనిపిస్తోందని.. ప్రజల సమస్యలను మర్చిపోయారని ఆయన విమర్శించారు.

కవిత కోసం తెలంగాణ కేబినెట్ అంతా దిల్లీలోనే కూర్చుందని.. తెలంగాణలో పాలన గాలికొదిలేశారని మధు యాష్కీ అన్నారు. అంతేకాదు.. దిల్లీ లిక్కర్ పాలసీపై విచారణ జరుపుతున్నట్లుగానే తెలంగాణ లిక్కర్ పాలసీపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.