జ‌న‌సేన‌ తో న‌ష్ట‌పోయాం: బీజేపీ హాట్ కామెంట్స్‌

ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌-బీజేపీ పొత్తుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నాయ‌కులు.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీగా న‌ష్ట‌పోవ‌డంతో(ఉత్త‌రాంధ్ర సిట్టింగ్ స్థానం బీజేపీ కోల్పోయింది) జ‌న‌సేన‌తో పొత్తుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆపార్టీ అధికార ప్ర‌తి నిధి.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయిన‌.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధ‌వ్ తీవ్ర‌స్థాయిలో హాట్ కామెంట్స్ కుమ్మ‌రించారు. జ‌న‌సేన‌తో న‌ష్ట‌పోయామ‌న్నారు. ఏదో పేరుకే తాము జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నామ‌ని తీవ్ర నిర్వేదం వ్య‌క్తం చేశారు.

జనసేనతో పేరుకే పొత్తు అనే పరిస్థితి ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగిందని.. మాధవ్‌ అన్నారు. ఎమ్మెల్సీ పోరులో జనసేన మద్దతిస్తున్నట్లు పీడీఎఫ్‌ ప్రచారం చేసుకున్నా, పవన్‌కల్యాణ్‌ సహా ఆ పార్టీ నేతలు ఖండించలేదన్నారు. ఈ విషయాన్ని జనసేన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. రెండు పార్టీలు కలిసి సాగాలనుకుంటే… క్షేత్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు. కానీ, ఆ ప‌రిస్థితి జ‌న‌సేన వైపు నుంచి రావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

మిత్రపక్షంగా తాము జనసేనతో కలిసి ఉన్నా లేనట్టే ఉందని మాధవ్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కోరినప్పటికీ జనసేన నుంచి ఎక్కడా ఎలాంటి ప్రకటన, మద్దతు లభించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పీడీఎఫ్‌ అభ్యర్ధులకు జనసేన మద్దతు ఉందని జరిగిన ప్రచారాన్ని సైతం ఖండించలేదని పేర్కొన్నారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదనేది వాస్తవమని అంగీకరించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పినట్టు ఇరుపార్టీ కార్యకర్తుల కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

ఈ దిశగా పవన్‌ కల్యాణ్‌, మనోహర్‌ ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. లేకపోతే పేరుకే ఈ రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టీడీపీకి పడిందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఆశిస్తోన్న రోడ్ మ్యాప్ అంటే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడమేనని మాధవ్‌ తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు మంచి అవకాశం ఉందని… మచిలీపట్నం సభకు వచ్చిన జనాన్ని అంతా చూశారని… ఇరు పార్టీలు కలిసి పోరాటాలు చేస్తే.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. మొత్తానికి బీజేపీకి ఇప్ప‌టికి జ‌న‌సేన విలువ తెలిసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.