వైసీపీకి షాకిచ్చిన టీడీపీ

అధికార వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అనూహ్యంగా షాకిచ్చింది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో నాలుగు రైండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందుబాటులోని సమాచారం ప్రకారం అన్నీ రౌండ్లలోను టీడీపీయే మంచి లీడ్ లో ఉంది. ఉత్తరాంధ్రలో మొత్తం 1.12 లక్షల ఓట్లున్నాయి. వీటిల్లో 4,644 ఓట్లు ఇన్ వాలీడ్ అయ్యాయి. మిగిలిన ఓట్లలో మొదటి రౌండ్ నుండి టీడీపీ అభ్యర్ధి చిరంజీవిరావుకు స్పష్టమైన ఆధిక్యత కనబడింది.

ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ అభ్యర్ధులు పోటీచేశారు. వీళ్ళమధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. అయితే అంతిమపోరాటం వైసీపీ-టీడీపీ మధ్యే అన్నట్లుగా తయారైంది. ఇందులో వైసీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన సీతంరాజు సుధాకర్ పై చిరంజీవి మంచి ఆధిక్యతతో కంటిన్యు అవుతున్నారు. ఇప్పటికి అయ్యింది నాలుగు రౌండ్లు మాత్రమే. ఇంకా లెక్కించాల్సిన రౌండ్లు చాలానే ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా మొదటి ప్రాధానత్యని రెండో ప్రధాన్యతని ఇలా రకరకాల కాంబినేషన్లుంటాయి.

ఎంఎల్సీ గ్రాడ్యుయేట్, టీచర్ల ఓట్ల లెక్కింపు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మామూలుగా ఎంఎల్ఏ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులాగ కాదు. అందుకనే ఈ ఎన్నికల ఫలితం ఫైనల్ అయ్యేందుకు కనీసం 48 గంటలు పడుతుంది. మొదటి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు అయ్యేసమయానికి చిరంజీవికి 49,512 ఓట్లొచ్చాయి. అలాగే సుధాకర్ కు 31,282 ఓట్లొచ్చాయి. అంటే చిరంజీవికి 18 వేల ఓట్ల స్పష్టమైన ఆధిక్యత కనబడుతోంది. అలాగే పీడీఎఫ్ అభ్యర్ధి రమాప్రభకు 18,110 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి మాధవ్ కు 5,193 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నిజానికి తన గెలుపు ఖాయమని మాధవ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాంటిది నాలుగోస్ధానంలో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీని ఓడించటమే ధ్యేయంగా టీడీపీ-పీడీఎఫ్ పొత్తుపెట్టుకున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వారు వేసుకునేట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు ఒక పార్టీ మరోపార్టీకి వేసేట్లు అనుకున్నారు. అయితే రెండుపార్టీల మధ్య ఓట్ల ట్రాన్సఫర్ జరిగినట్లు లేదు. ఎందుకంటే టీడీపీ అభ్యర్ధి మొదటిస్ధానంలో ఉంటే పీడీఎఫ్ అభ్యర్ధి మూడోస్ధానంలో నిలిచారు. అన్నీ రౌండ్లు పూర్తయ్యేసరికి ఏమవుతుందో  చూడాల్సిందే.