అందుకే జగన్ ఢిల్లీ టూర్ ?

వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో చిక్కుకోవడం ఖాయమని తేలిపోయింది. తీగె లాగితే డొంక కదులుతున్నట్లుగా సీఎం జగన్ కుటుంబానికి కూడా ఇబ్బందులు తప్పవన్న చర్చ మొదలైంది. భారతీ రెడ్డి సహాయకుడితో పాటు జగన్ పీఎను మరోసారి ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ అప్పాయింట్‌మెంట్ కూడా పొందారు. హోంమమంత్రి అమిత్ షాను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.

అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం జరగడం, సీబీఐ కూడా వారిని అదుపులోకి తీసుకుంటామని తెలంగాణా హైకోర్టులో ప్రకటించడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పయనమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఖరారు కావడం చర్చనీయాంశమైంది. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వరకూ రావడంతో సిఎం శిబిరం అప్రమత్తమైంది. ఇప్పటివరకూ సీబీఐ దర్యాప్తు వేగం అందుకున్న ప్రతి సారి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అనవాయితీగా వస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ఖరారు కావడంతో ఆయన పర్యటన వెనుక పరమార్దం సీబీఐ దర్యాప్తును దూకుడు తగ్గించేందుకేనని ప్రచారం జరుగుతోంది. సీబీఐ వద్ద వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల ప్రమేయం పై స్పష్టమైన ఆధారాలు ఇప్పటికే ఉన్నాయి.

సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్ ను మార్చాలంటూ సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాసినట్టు ఇప్పటికే తెలంగాణా హైకోర్టులో అవినాష్‌ రెడ్డి తరపు న్యాయవాది వివరించారు. దర్యాప్తు కీలక దశకు చేరుకోవడం , ఇప్పటికే రామ్‌సింగ్ పై ఏపీలో కేసు నమోదు కావడంతో సీబీఐ ఉన్నతాధికారులు ఈ కేసులో దూకుడు పెంచాలని నిర్ణయించారు. సీబీఐ దూకుడు తాడేపల్లి వరకూ వస్తుందేమోనన్న ఆందోళన సిఎం శిబిరంలో ప్రారంభమైంది. దీంతో, ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర హొమ్‌ మంత్రి అమిత్‌ షాతో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర న్యాయశాఖా మంత్రితో కూడా విజయసాయి రెడ్డి భేటీ కావడం వెనుక సిఎం పర్యటనకు లైన్ క్లియర్ చేయడమేనని చెబుతున్నారు.