బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో కొత్త రూటు వెదుక్కుంటున్నారు. ఆయన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన సమక్షంలో కిరణ్ కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం..

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన తర్వాత కిరణ్ రాజకీయాల్లో అంతగా క్రియాశీలంగా లేరు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించిన నేపథ్యంలో కిరణ్ బాగా నొచ్చుకున్నారని చెబుతున్నారు. దానితో ఆయన కాంగ్రెస్ కు దూరంగా జరిగి ఊరుకున్నారన్న చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పేరున్న నాయకుడు అవసరం. కన్నా లక్ష్మీ నారాయణ వెళ్లిపోయిన తర్వాత పార్టీకి ఛరిస్మా ఉన్న నేత కావాలని బీజేపీ భావించింది. సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ ముందుకు సాగడం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా ఓట్ షేర్ పెరగాలంటే బలమైన నాయకత్వం అవసరమని గుర్తించారు.

చాలా రోజులుగా కిరణ్ కు గాలం వేస్తున్న కమలనాథులు ఈ సారి సీరియస్ గానే ఆయనపై దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉండటంతో కిరణ్ కూడా బీజేపీ ఆఫర్ ను తిరస్కరించలేకపోయారు. పార్టీలోకి వచ్చినందుకు ఆయన హోదాకు తగిన పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో కిరణ్ అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు.