కేసీఆర్ ఫ్యామిలీని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నారా?

KCR

లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కల్వకుంట్ల కవిత కారణంగా ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నెత్తి నొప్పులు తెచ్చుకుంది. ఇది అంత త్వరంగా సమసిపోయే కేసు కాకపోవడం.. సీబీఐ, ఈడీలు యమ జోరుగా దర్యాప్తు, విచారణ చేస్తుండడంతో కవిత ఈ కేసులో పీకల్లోతున కూరుకుపోయారనే చెప్పాలి. ఆమె ఈ కేసులో దోషిగా తేలుతారా? నిర్దోషిగా తేలుతారా? అవినీతికి పాల్పడ్డారా? ఆమెకు సంబంధమే లేకుండా కేంద్రం ఇరికించిందా అనే విషయాలన్ని పక్కనపెట్టినా కూడా ఈ కేసు ఏదో ఒక ఒడ్డుకు చేరేవరకు మాత్రం కవితకు తిప్పలు తప్పవు. నిత్యం విచారణలు, అనునిత్యం ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే.

ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఒక్కరితోనే సరిపెట్టకుండా మొత్తం కేసీఆర్ రాజకీయ కుటుంబాన్నంతటినీ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు పలుమార్లు కంప్లయింట్ చేసిన వైఎస్సార్‌టీపీ నేత వైఎస్ షర్మిల ఈ విషయంలో మరింత ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తనను పదేపదే అరెస్ట్ చేస్తుండడంతో ఆమె కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఆమె సుప్రీంను ఆశ్రయించడానికి న్యాయవాదులతో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన మేఘా సంస్థతో ఏర్పడిన కొన్ని విభేదాలూ దీనికి కారణంగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. కారణమేదైనా ఆమె కాళేశ్వరాన్ని విడిచిపెట్టాలనుకోవడం లేదని.. అందులో అవినీతి జరిగిందని కేసులతో కేసీఆర్‌ను ఇరుకునపెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ నుంచి మద్దతు కోసం ఆమె కూడా చూస్తున్నట్లు టాక్.

ఇకపోతే… ఆటలో అరటిపండని అందరూ అనుకున్నా అనూహ్యమైన పనులతో ఆటాడించేసే కేఏ పాల్ కూడా కేసీఆర్‌పై పీకల్దాకా కోపంతో ఉన్నారు. సిద్ధాంతపరంగా, పార్టీపరంగా, మతపరంగా తనకు ఏమాత్రం మ్యాచ్ కాని బీజేపీ పెద్దలు సైతం తనకు అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇస్తారని.. కానీ, తాను నిరసన తెలపడానికి కూడా కేసీఆర్ పర్మిషన్ ఇవ్వరన్నది పాల్ కోపం. తాజాగా ఆయన తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌పై కారాలుమిరియాలు నూరుతున్నారు. కొత్త సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం ఎందుకు జరిగిందో చెప్పాలని నిలదీస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కొత్త సెక్రటేరియట్‌లో నరబలి జరిగిందని.. దాన్ని కప్పిపుచ్చడానికి నిప్పంటించి అగ్నిప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారన్నది ఆయన ఆరోపణ. దీంతో ఆయన ఈ ప్రమాదంపై విచారణ జరపాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మరోవైపు సెక్రటేరియట్‌కు భారీగా ప్రజాధనం ఖర్చు చేశారనీ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ సైతం తన కేసులను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలోని పెద్దలతో కేఏ పాల్‌కు ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆయనకు కూడా అండ దొరికితే కేసీఆర్‌ను ఇరుకుపెట్టేలా కేసులు వేస్తారన్న అంచనాలు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. మొత్తంగా అన్ని వైపుల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది రాజకీయ ప్రత్యర్థుల వ్యూహంగా తెలుస్తోంది.