అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తాం: కోర్టుకు చెప్పేసిన సీబీఐ

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయ‌న తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని సీబీఐ తేల్చి చెప్పింది. ఈ విష‌యాన్ని తెలంగాణ‌ హైకోర్టుకు చెప్పిన సిబిఐ అధికారి రాంసింగ్ వెల్ల‌డించారు. అవినాష్ రెడ్డి దాఖ‌లు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు సీబీఐని కూడా విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిపాత్ర ఏంటి? ఆయ‌న‌ను అరెస్టు చేస్తారా? అని ప్ర‌శ్నించింది. ఈ నేప‌థ్యంలో స్పందించిన రాంసింగ్..ఔను అరెస్టు చేస్తామ‌ని చెప్పారు.

అదేస‌మ‌యంలో ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి వీడియోగ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్ లు ఎప్పుడు సమర్పిస్తారని న్యాయస్థానం సీబీఐని ప్ర‌శ్నించింది. దీంతో ఆయ‌న ఇప్పటికి ఇప్పుడే కోర్ట్ కి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త‌మ‌కు ఇప్పుడు కావాల‌న్నా స‌మ‌ర్పిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇక‌, అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితుడా ? సాక్షి మాత్ర‌మేనా అని కోర్టు ప్ర‌శ్నించింది. సాక్షిగా పరిగణించి అవినాష్ రెడ్డి కి 160 CRPC కింద నోటీసుల ఇచ్చామ‌ని సీబీఐ అధికారి వెల్ల‌డించారు.

అనుమానాలు బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసులో అవినాష్ రెడ్డిని, ఆయ‌న తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని మ‌రోసారి వెల్ల‌డించారు. సోమవారం రోజు విచారణకు రావాలని అవినాష్ ను కోరతామ‌ని రాంసింగ్ కోర్టుకు తెలిపారు. అయితే.. అదే రోజు కోర్టులో కేసు విచార‌ణ ఉన్న నేప‌థ్యంలో మ‌రో రోజు విచారించాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయ‌న మంగ‌ళ‌వారం విచారిస్తామ‌ని తేల్చి చెప్పారు. దీంతో కోర్టు.. సోమవారం వ‌ర‌కు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయ‌రాద‌ని మ‌ధ్యంత ఉత్త‌ర్వులు జారీ చేసింది.