ఎస్సీ, ఎస్టీ కేసుకు రెడీ అవుతున్న అనిత

టీడీపీ ఫైర్ బ్రాండ్ లేడీ అనితను వైసీపీ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఆమెను ఇబ్బందిపెట్టే పోస్టులతో వ్యతిరేక ప్రచారమే వైసీపీ సోషల్ మీడియా పనిగా ఉంటుంది. ఈ సారి కూడా సరిగ్గా అదే జరిగింది.

మహిళా దినోత్సవం రోజున…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించారు. అనిత ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి యాత్రలో పాల్గొన్నారు. అప్పుడు లోకేష్ మహిళలకు పాదాభివందనం చేశారు. ప్రసంగాలు చేసే క్రమంలో అనిత స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును సీఎం చేసేందుకు మహిళలంతా కృషి చేస్తామని అనిత ప్రకటించారు.

వీడియో మార్ఫింగ్..

అనిత స్పీచ్ ఇలా ముగిసిందో లేదో వైసీపీ మీడియా సెల్ అలా రంగంలోకి దిగింది. అనిత మాటల్లో చంద్రబాబు అన్న ప్లేస్ లో జగన్ అన్న మాటను చేర్చింది. అనిత వేరే స్పీచ్ నుంచి జగన్ అన్న మాటను తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశారు. దానితో జగన్ ను సీఎం చేసేందుకు తాము కృషి చేస్తామని అనిత చెప్పినట్లుగా సీన్ క్రియేట్ అయిపోయింది. కొన్ని గంటల పాటు టీడీపీ వాళ్లే కన్ఫ్యూజ్ అయ్యారు. ఒరిజినల్ వీడియో చూసిన తర్వాత గానీ అసలు విషయం అర్థం కాలేదు. దానితో టీడీపీ గట్టి కౌంటర్లు వదిలింది..పైగా అనితపై చర్యలు తీసుకుంటామంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్లుగా వచ్చిన నకలీ ప్రెస్ నోట్ కూడా కొంత సేపు టీడీపీలో టెన్షన్ కు కారణమైంది.

అనిత ఆగ్రహం

తనను ట్రోల్ చేసిన వారిపై అనిత సీరియస్ అయ్యారు. వీడియోను ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. సాక్షి చానెల్ లో కూడా వేసుకుని ఆనందం పొందారన్నారు. తర్వలోనే ట్రోలర్స్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతానని అనిత ప్రకటించారు. ఆమె కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.