తమ్ముళ్ళపై నిఘా పెంచుతున్న చంద్రబాబు

తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. ఇందులో భాగంగానే ఆర్ధికంగా అత్యంత పటిష్టంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీ పగ్గాలను అప్పగించారు. తెలంగాణాలోని ఖమ్మంలో భారీఎత్తున బహిరంగసభ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేయిస్తున్నారు. కార్యక్రమాల్లో తమ్ముళ్ళు సరిగా పాల్గొంటున్నారా లేదా కార్యక్రమాలతో జనాల్లోకి నేతలు వెళుతున్నారా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇవి సరిపోవన్నట్లు కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా పార్టీ తరపున ఒక యాప్ ను తీసుకొచ్చారు. దూరమైన జనాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలంటే వాళ్ళదగ్గరకు తమ్ముళ్ళు వెళ్ళటమే ఏకైక మార్గమని చంద్రబాబు అనుకున్నారు. అందుకనే ‘ఇంటింటికి టీడీపీ’ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. కార్యక్రమాల్లో తమ్ముళ్ళంతా రెగ్యులర్ గా పాల్గొంటున్నారా లేదా అనే విషయాన్ని ప్రతిరోజు చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు.

ప్రత్యేకంగా రెడీచేసిన యాప్ ను తమ్ముళ్ళ మొబైల్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేయించారు. గుగుల్ కెమెరాల్లాంటిది ఇన్ స్టాల్ చేయించి వాటిద్వారా జనాలను కలుస్తున్న ఫొటోలను ప్రతిరోజు అప్ లోడ్ చేయమని ఆదేశించారు. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే నేతలు ఫొటోలు తీస్తున్నపుడు తేదీ, టైం తదితరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ రూపంలో కనబడుతుంది. అంటే పాత ఫొటోలను తమ్ముళ్ళు యాప్ లో అప్ లోడ్ చేసేందుకు లేదు. సరిగ్గా ఈ విషయంలోనే కొందరు తమ్ముళ్ళు ఇబ్బందులు పడుతున్నారట.

కొందరు మొబైల్ ఫోన్ల నుండి రోజువారీ రావాల్సిన సమాచారం, ఫొటోలు పార్టీ ఆఫీసుకు అందటంలేదట. దాంతో అలాంటి నేతలపై చంద్రబాబు మండిపోతున్నారు. రెగ్యులర్ గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎంతచెప్పినా తీరుమార్చుకోని తమ్ముళ్ళకు వచ్చేఎన్నికల్లో టికెట్లు ఇచ్చేదేదని స్పష్టంగా చెప్పేశారు. అలాగే పార్టీ పదవులనుండి కూడా దూరం పెట్టాలని కాసానికి చెప్పేశారట. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా తమ్ముళ్ళు జనాల్లోకి వెళ్ళకపోతే ఇంకెపుడు వెళతారు అనేది చంద్రబాబు ప్రశ్న. మరి ఎంత ప్రయత్నించినా తీరుమార్చుకోని తమ్ముళ్ళని ఎవరు మాత్రం ఏమి చేయగలరు ?