రామ్ మాధవ్ ఏమయ్యారు?

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నా ప్రభుత్వ పదవులు కానీ చట్టసభల్లో స్థానం కానీ కోరుకోకుండా పనిచేసే నాయకులున్న రాజకీయ పార్టీ అంటే ఒక్క బీజేపీయే. ఆ పార్టీలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ కాకుండా… నామినేటెడ్ పోస్టులు కూడా చేపట్టకుండా కేవలం పార్టీ పదవుల్లో ఉంటూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసే నాయకులు బీజేపీలో వేలాదిమంది ఉంటారు. వారిలో జాతీయ స్థాయిలో పనిచేసేవారూ ఉంటారు. వారు నేరుగా మోదీ, అమిత్ షా, నడ్డాలతో కలిసి పనిచేస్తున్నా వారిలా రాజకీయ పదవులు అనుభవించడం లేదన్న బాధ వారిలో ఎన్నడూ కనిపించదు. అందుకు కారణం… వారికి పార్టీలో ఉన్న ప్రాధాన్యం, వారి ఆలోచనలు, వారి పని, వారి మాటకు ఉన్న ప్రాధాన్యం. అలాంటి బీజేపీ నాయకులందరి మూలాలు ఆర్ఎస్ఎస్‌లోనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అలాంటి సమకాలీన నాయకుల్లో ముందువరుసలో ఉండే పేరు రాం మాధవ్.

సుదీర్ఘ కాలంగా బీజేపీ కోసం పనిచేస్తున్న రాం మాధవ్.. గతంలో కొంతకాలం పాటు ఏపీలో నిత్యం తిరుగుతూ, పబ్లిక్‌లో కనిపిస్తూ వార్తల్లో ఉండేవారు. దీంతో బీజేపీ ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేయడానికి ఆలోచిస్తోందని.. ఏపీలో అధికారంలోకి రావడానికి పావులు వేగంగా కదుపుతోందని భావించారు. కానీ.. ఎందుకో.. బీజేపీ స్పీడూ తగ్గింది, రాం మాధవ్ బయట కనిపించడమూ తగ్గింది.

ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పటి పాలక పక్షం టీడీపీని, అప్పటి సీఎం చంద్రబాబును సునిశితంగా విమర్శిస్తూ వార్తల్లో నిలిచేవారు. అనంతరం జగన్ సీఎం అయిన తరువాత కూడా మూడు రాజధానుల బిల్లు వంటి విషయాల్లో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కానీ.. అక్కడికి కొన్నాళ్ల తరువాత ఆయన సైలెంటయ్యారు. ముఖ్యంగా సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన తరువాత రామ్ మాధవ్ అటు చూడడం మానేశారు.

ఇంతకీ రామ్ మాధవ్ ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారంటే సమాధానం.. చాలా ముఖ్యమైన అంశాలపై ఆయన పనిచేస్తున్నారని వినిపిస్తోంది. ఇంతకుముందు కశ్మీర్ అంశంపై పనిచేసిన ఆయన ఇప్పుడు అంతర్జాతీయంగా మోదీ ఇమేజ్, బీజేపీ ఇమేజ్ దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రను కౌంటర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అందించడం, అధ్యయనం చేయడం, వివిధ వేదికలపై ఆలోచనాపరుల ఆలోచనలను బీజేపీకి సానుకూలంగా ప్రభావితం చేయడం వంటి అంశాలపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆయన ఢిల్లీలోనే ఉంటూ నిత్య అధ్యయనంలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మోదీ, బీజేపీకి అండగా గళం వినిపించాల్సి వచ్చినప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రింట్ వంటి నేషనల్ మీడియా వెబ్ సైట్లలో కథనాలు రాస్తున్నారు రాం మాధవ్.

ఏపీ బీజేపీ నేతలు ఆయన్ను ఉపయోగించుకోకపోయినా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి తెలంగాణ నేతలు తరచూ ఆయన్ను కలుస్తూ ఇన్‌పుట్స్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే… వచ్చే ఎన్నికల నాటికి రాంమాధవ్ మళ్లీ యాక్టివ్ అవుతారని.. ఈసారి ఆయన రోల్ భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది.