ఇండియాలో జీఎస్టీ, ఏపీలో జేఎస్టీ !

ఒక దేశం.. ఒక పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి విషయంలోనూ వెంబడిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ జీఎస్టీకి కంటే కూడా జేఎస్టీ మరింత పవర్ ఫుల్ అని.. ఏపీలో దీని హవా మామూలుగా లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.

ఇంతకూ ‘‘జేఎస్టీ’’ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘జగన్ సెల్ప్ ట్యాక్స్’’ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో జేఎస్టీని తట్టుకోలేకపోతున్నారని.. కప్పం కట్టకుంటే పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కప్పం ప్రస్తావన వచ్చినప్పుడు స్పందించిన ఆది.. ‘‘నేను మంత్రిగా ఉన్నప్పుడు దాల్మియా సిమెంట్స్ వచ్చింది.

మైసూరారెడ్డికిచెందిన తేజా సిమెంట్స్ పరిశ్రమకు అనుమతి వచ్చింది. తర్వాత ప్రభుత్వం మారింది. జగన్ ట్యాక్స్ కట్టలేక మైసూరారెడ్డి పరిశ్రమ రాలేదు. దాల్మియా సిమెంట్స్ రెండో దశకు రాలేదు. జీఎస్టీ కంటే జేఎస్టీ పవర్ ఫుల్. జగన్ సెల్ఫ్ ట్యాక్స్ ను తట్టుకోలేకపోతున్నారు. జగన్ కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆయనకే తెలీదు. కేరళలోని పద్మనాభ స్వామికి నేలమాళిగలు ఉన్నట్లే.. ఎన్ని నేలమాళిగలు ఉన్నాయో లెక్కే లేదు. ఆయన అనంత పద్మనాభ స్వామి అయితే.. ఈయన అనంత జగన్నాథ స్వామి. అప్పుటు చేయటంలో.. తప్పులు చేయటంలో.. దౌర్జన్యం.. అన్యాయం చేయటంలోనూ ఎక్స్ పర్ట్’’ అని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

వివేకా దారుణ హత్యలో తన పాత్ర ఉందని తప్పుడు ప్రచారం చేశారని.. ఎక్కడికి పోయినా ఇదే అడిగేవాళ్లని.. తాను ఎన్నికల్లో ఓడిపోవటానికి ఇదో ప్రధాన కారణంగా మారిందన్నారు. ‘వివేకా హత్య తర్వాత ఎక్కడికి వెళ్లినా ఇదే అడిగేవాళ్లు. ఇప్పుడు విచారణ జరిగి.. విషయాలు బయటకు వచ్చిన తర్వాత నన్నుకలిసినప్పుడు ఒక విషయాన్ని చెప్పేవారు. వివేకాను నేనే చంపించినట్లుగా తాము వంద శాతం నమ్మినట్లుగా నాతో చాలామంది చెప్పారు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చాలామందికిఅసలు విషయంఅర్థమైంది. సొంత చిన్నాన్నను చంపి అవతలి వ్యక్తులపై తోసి మమ్మల్ని కూడా నమ్మేలా చేశాడు కదా అని జనం అనుకుంటున్నట్లుగా మాజీ మంత్రి ఆది వ్యాఖ్యానించారు.

తనపై సీఎం జగన్ పలు కేసులు పెట్టిన వైనాన్ని వెల్లడించారు. ‘నాపైన ఎన్నో కేసులు పెట్టారు. నాపై జగన్ రెడ్డి సీఐడీ కేసు.. ఎస్సీ.. ఎస్టీ కేసు.. ఫ్యాక్షన్ కేసు అన్ని మోపాడు. నన్ను అరెస్టు చేయటానికి విశ్వప్రయత్నం చేశాడు. నేను తెలివైనోడిని కనుక మంచి లాయర్ ను పెట్టుకొని సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడా. ఇప్పుడు బీజేపీలో ఉన్నాను. జగన్ మాదిరి దొంగ మాటలు చెప్పం. అధికారం కోసం మాటలు చెప్పే నీచ కల్చర్ మా దగ్గర లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.