అమరావతికి అంతర్జాతీయ మ్యాగజైన్ గుర్తింపు

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అమరావతికి శంకుస్థాపన చేసే సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరోసారి చంద్రబాబు సీఎం అయి ఉంటే ఆంధ్రుల అంతరాత్మ అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా విరాజిల్లుతుండేదని నిపుణులు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ డైజెస్ట్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో అమరావతి రాజధానికి 6వ స్థానం దక్కింది. నిర్మాణంలో ఉన్న ప్రపంచ స్థాయి నగరాల జాబితాను ఈ సంస్థ రూపొందించగా అందులో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ జాబితాలో అమరావతి ఆరో స్థానాన్ని దక్కించుకోవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

మ్యాగజైన్ ఎంపిక చేసిన భావి నగరాల జాబితాలో అమరావతి ఉండడం సంతోషకరమని ఆయన అన్నారు. స్థిరంగా అభివృద్ధి చెందే ఓ ఆధునిక నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని తాను భావించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రపంచపటంలో భారత్ గర్వించే స్థాయిలో అమరావతిని నిర్మించాలని సంకల్పించానని అన్నారు.

ఇక, పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని, కానీ, అమరావతి కార్యరూపం దాల్చలేదని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. కానీ, భవిష్యత్తులో రూపుదిద్దుకునే కొత్త నగరాలు ఎలా ఉండాలో చెప్పేందుకు అమరావతి ఒక నమూనా అని అభిప్రాయపడింది. అమరావతి ప్లాన్ లో ఒక ప్రభుత్వ భవన సముదాయం నగరానికి వెన్నెముకలా ఉంటుందని, ఢిల్లీలోని ల్యుకింగ్ సెంట్రల్ పార్క్ మాదిరిగా అమరావతి నగరం మధ్యలో భారీగా పచ్చదనం ఉండేలా డిజైన్ చేశారని ప్రశంసించింది. నగరంలో 60 శాతం పచ్చదనం, నీరు ఉండేలా డిజైన్ చేయడం చాలా గొప్ప విషయమని ఆ మ్యాగజైన్ ప్రశంసించింది. అనుకున్నట్టుగా అమరావతి రూపుదిద్దుకొని ఉంటే ప్రపంచ మహా నగరాల్లో అమరావతి సుస్థిర స్థానం దక్కించుకొని ఉండేదని చెప్పింది.