ఏపీ క‌మ‌లం.. వికాసం కాదు.. విచ్ఛిన్నం!

ఔను! నిజ‌మే… ఏపీలో బీజేపీ విక‌సించ‌డం లేదు… మ‌రింత‌గా విచ్ఛిన్న‌మ‌వుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంకేముంది.. అధికారంలోకి వ‌చ్చేస్తాం.. పార్టీని అధికారంలోకి తెచ్చేస్తామ‌ని… చెప్పిన పార్టీ పెద్ద‌లు.. ఇప్పుడు మౌనంగా ఉండడం.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ విచ్చిన్నం కావ‌డానికి దారులు వేసిన‌ట్టు అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అస‌లు ఏం జ‌రిగింది?

బీజేపీకి అంతో ఇంతో ప‌ట్టున్న ఏపీలో ఇప్పుడు పూర్తిగా క‌మలం రేకులు విడిపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్ష విధానాలపై అసంతృప్త గళాలు మ‌రింత పెరుగుతున్నాయి. ఇలాంటి నాయకులు తాజాగా త‌మకు ఉన్న‌ పదవులను వదిలేసేందుకు సిద్ధమైపోయారు. నిజానికి పాతిక, ముప్పై ఏళ్లుగా వీరంతా కూడా బీజేపీ కోసం ప‌నిచేస్తున్నారు. అస‌లు ఏమీ రోజుల నుంచి అంతో ఇంతో పుంజుకునే ప‌రిస్థితి వ‌చ్చిందంటే వీరే కార‌ణం.

ముఖ్యంగా మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు చొర‌వ‌తో పార్టీలోకి వ‌చ్చిన వారు..త‌ర్వాత‌.. అనేక మందిని పోగు చేసుకున్నారు. అయితే.. వీరిని కాదని, బీజేపీ సిద్ధాంతాలు కూడా తెలియని వారిని తీసుకొచ్చి వీర్రాజు అందలం ఎక్కిస్తుండటం పట్ల వీరంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జిల్లాల అధ్యక్షుల మార్పుతో రాజీనామాలు, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసే ప‌రిస్థితికి వ‌చ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. వీరికి ఎలాంటి సానుకూల ప‌రిణామాలు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌స్తుతానికి పార్టీ పదవులన్నీ వదిలేసి, కార్యక్రమాలకు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీజేపీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ సేవలు పార్టీకి అవసరం లేదనే విధంగా రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. ఈ ప‌రిణామంతో ఎన్నిక‌ల‌కు ముందు.. బీజేపీ మ‌రింత ఏకాకి కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.