క‌న్నా వ‌ర్సెస్ రాయ‌పాటి.. యూట‌ర్న్ పాలిటిక్స్‌!!

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీ బాట ప‌ట్టారు. అయితే.. గుంటూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్న రాయపాటి సాంబ‌శివ‌రావు.. నాలుగు రోజుల కింద‌ట‌.. క‌న్నా లాంటివారు వ‌చ్చినా.. త‌న‌కు ఇబ్బంది లేద‌ని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రావ‌డ‌మే.. త‌మ‌ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నాయ‌కులు కూడా హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు.

కానీ, రాత్రికి రాత్రి ఏం జ‌రిగిందో ఏమో.. వెంట‌నే రాయ‌పాటి యూట‌ర్న్ తీసుకున్నారు. క‌న్నా గ‌తంలో చంద్ర‌బాబును దూషించార‌ని.. త‌న‌ను కోర్టుకు లాగి ప‌రువున‌ష్టం కేసు వేశార‌ని.. అలాంటి వ్య‌క్తితో క‌లిసి తాను ప్ర‌యాణం చేయ‌లేన‌ని చెప్పుకొచ్చారు. మ‌రి ఇంత‌లోనే ఆయ‌న ఎలా మారిపోయార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం.. అధికార పార్టీ నేత‌లు ఉన్నార‌ని టీడీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల‌కుముందు నుంచి కూడా రాయ‌పాటిపై వైసీపీ నేత‌ల క‌న్ను ప‌డింది. అప్ప‌ట్లో న‌ర‌సారావుపేట ఎంపీ టికెట్‌ను రాయ‌పాటి మ‌రోసారి ఆశించారు. అయితే.. ఆయ‌న వృద్ధుడు అయిపోవ‌డంతో పార్టీ నాయ‌కులు వ‌ద్ద‌ని చెప్పారు. దీంతో చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. మ‌రోవైపు ఎన్నిక‌ల నామినేష‌న్ డేట్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంది. దీంతో ఒక్క‌సారిగా రాయ‌పాటి తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు.

నాక‌న్నా.. బ‌ల‌మైన‌.. గెలిచే అభ్య‌ర్థి ఉంటే టికెట్ ఇచ్చుకోమనండి.. అని కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ అనుకూల మీడియాలో ఇంకేముంది.. రాయ‌పాటి టీడీపీకి రాజీనామా చేస్తున్నార‌ని ప్ర‌చారం చేశాయి. దీంతో వెన‌క్కి త‌గ్గిన చంద్ర‌బాబు గెలిస్తే.. గెలుస్తాం.. ఓడితే ఓడుతాం.. అంటూ.. టికెట్‌ను ఆయ‌న‌కే ఇచ్చారు. తీరా.. రాయ‌పాటి ఓడిపోయారు. ఇక‌.. అప్ప‌టి నుంచి సైలెంట్‌గా ఉన్న రాయ‌పాటి.. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. అది కూడా క‌న్నా విష‌యంలో ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డం చూస్తే.. వైసీపీ ఉద్దేశ పూర్వ‌కంగా ఏదో చేయిస్తోంద‌ని టీడీపీ నేత‌లు అనుమానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.