ఇక‌, ఉద్యోగుల వంతు.. ‘సోష‌ల్ కేసు’ల‌కు స‌ర్కారు సిద్ధం!

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక బాధ్య‌త ఉన్న‌వారు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శించినా.. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను త‌ప్పుబ‌ట్టినా.. లేక సోష‌ల్ మీడియాలో ఏదైనా కామెంట్లు చేసినా.. వెంట‌నే రాత్రికి రాత్రి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డిక‌క్కడ అరెస్టులు.. కోర్టులు.. దెబ్బ‌లు.. కామ‌న్ అయిపోయాయి. వ‌య‌సుతో సంబంధం లేదు.. సీనియార్టీతో అంత‌క‌న్నా ప‌ట్టింపు లేదు.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే చాలు.. వారిని లాగిప‌డేయాల్సిందే!

ఇదే తంతుగా మూడేళ్లుగా ఏపీలో పోలీసులు రెచ్చిపోయార‌ని ప్ర‌జాస్వామ్య వాదులు చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల వంతు వ‌చ్చింది. ఎవ‌రైనా ఉద్యోగులు.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో గ‌ళం వినిపిస్తే.. వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు స‌ర్కారు ఏకంగా ఉత్త‌ర్వులే జారీ చేసేసింది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేరుతో ఒక ఉత్త‌ర్వు ఇప్పుడు అన్ని శాఖ‌ల‌కుచేరింది.

దీని సారాంశం ఏంటంటే.. “మీ మీ శాఖ‌ల్లోని ఉద్యోగులు.. సిబ్బంది.. ప్ర‌భుత్వాన్ని… ముఖ్య‌మంత్రిని, ఇత‌ర మంత్రుల‌ను దూషిస్తూ.. ప్ర‌భుత్వ విధానాల‌ను వేలెత్తి చూపిస్తూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేయ‌డం.. వీడియోలు పోస్టు చేయ‌డం వంటివి చేయ‌డానికి వీల్లేదు. మీరు(ఆ శాఖల ఉన్న‌తాధికారులు) నిత్యం వీటిపై ఒక క‌న్నేసి ఉంచండి. ఎవ‌రైనా ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని మీకు అనిపిస్తే వెంట‌నే జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగానికి వారిని రిఫ‌ర్ చేయండి” అని పేర్కొన్నారు.

వాస్త‌వానికి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల కంటే కూడా ఉద్యోగులే ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఆరోపించారు. దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల‌కు ముందు.. ఉద్యోగుల‌కు ఇచ్చిన సీపీఎస్ ర‌ద్దు.. కాంట్రాక్టు ఉద్యోగుల ప‌ర్మినెంట్‌, పీఆర్సీ.. వేత‌న బ‌కాయిలు.. విడుద‌ల, నివేశ‌న స్థ‌లాలు ఇవ్వ‌డం.. వంటి అనేక హామీల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే వీరంతా కూడా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే త‌ర‌చుగా కొంద‌రు ప్ర‌భుత్వ తీరును సోష‌ల్ మీడియాలో ఎండ‌గ‌డుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇలాంటి వారిని గుర్తించి కేసులు పెట్టేందుకు స‌ర్కారు స‌న్న‌ద్ధ‌మైంది.