ఏపీలో 100 సీట్లు గెలిచే పార్టీ ఇదే

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 151 సీట్లు గెలిచింది. కానీ, 2024 ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని గ్యారంటీ లేదు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైపన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.. అయితే, 100 సీట్ల మార్క్‌కు చేరుకుంటుందా అంటే అదీ చెప్పడం కష్టమే. ఇక 2019లో చచ్చీచెడీ సింగిల్ సీటు కొట్టిన జనసేన వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించనుంది.. కానీ, ఈ కింగ్ మేకింగ్ పార్టీ సొంతంగా సెంచరీ కొట్టడం అసాధ్యమన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సంగతేంటంటే… బోణీ చేస్తే అదే పదివేలు అంటున్నారు ఆ పార్టీ నేతలే.

ఈక్వేషన్లన్నీ ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు ‘నేనే నంబర్ 1’.. 100 సీట్లు మావే అంటోంది కాంగ్రెస్ పార్టీ. అవును… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 100 సీట్లు గెలవడం గ్యారంటీ అంటున్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.

ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు గిడుగు రుద్రరాజు చేపట్టిన తరువాత పార్టీ కార్యక్రమాలు కొంత జరుగుతున్న మాట వాస్తవమే. అయితే, మూలన కూర్చున్న పార్టీ సీనియర్లు మాత్రం ఇంకా స్పీడందుకోలేదు. అలా అని కొత్త నాయకులూ ఎక్కడా కనిపించడం లేదు. రుద్రరాజు, ఆయన వెంట తిరిగే కొందరు నాయకులు తప్ప మిగతావారిలో నిస్తేజమే.

అంతెందకు.. పార్టీ అధిష్ఠానం కూడా ఏపీలో కాంగ్రెస్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పీసీసీ ప్రెసిడెంట్ పాదయాత్ర చేస్తున్నారు. నాయకులు నిత్యం ఢిల్లీతో టచ్‌లో ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులూ వచ్చి వెళ్తున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, ఏపీ కాంగ్రెస్ విషయంలో అధిష్ఠానం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతామని ఆయన అన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అని, వైసీపీతోనే తమ పోరాటమని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం లిక్కర్, ఎర్రచందనం, ఇసుక, భూమాఫియాలతో పాలన సాగిస్తోందని… తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా అంతం చేస్తామని చెప్పారు.

మరి, రుద్రరాజు 100 సీట్ల టార్గెట్ పెట్టుకున్నా కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఎంతవరకు సహకరిస్తారు.. అసలు 100 సీట్లలో పోటీకి అభ్యర్థులు ఉన్నారా? పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సహకారం ఉండనుంది… పాత నేతలంతా కలిసివస్తారా వంటివన్నీ సమాధానంలేని ప్రశ్నలే.