అంతా స‌జ్జ‌ల డైరెక్ష‌న్‌లోనే.. చంద్ర‌బాబు ఫైర్‌

త‌న ప‌ర్య‌ట‌న‌లో పోలీసులు అడుగ‌డుగునా ఉక్కుపాదం మోప‌డం, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయడం.. స‌భ‌ను అడ్డుకోవ‌డం అన్నీ కూడా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లోనే సాగుతున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

“ప్రజల్లో వ్యతిరేకత గమనించే జ‌గ‌న్‌ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారు. ముందురోజు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి… అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకొచ్చాయి. ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకోవాలి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారని మండి ప‌డ్డారు. పోలీసులు ఉద్దేశ పూర్వ‌కంగానే టీడీపీ కార్యకర్తలపై గురిపెట్టి దాడి చేశారు. కార్యకర్త ప్రకాశ్ నాయుడిని గుండెలపై కొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులు సహకరించొద్దని కోరుతున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

బాధిత త‌మ్ముళ్ల‌కు ప‌రామ‌ర్శ‌..

అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శిం చారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన చంద్రబాబు.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని.. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని వారికి ధైర్యం చెప్పారు.