వంగ‌వీటి ఎవ‌రి వాడు.. బీజేపీకి ఏం సంబంధం?

ఔను.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు.. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే దివంగ‌త వంగ‌వీటి రంగా ఎవ‌రి వాడు? అస‌లు బీజేపీకి.. ఆయ‌న‌కు సంబంధం ఉందా? అసలు ఏనాడైనా.. బీజేపీ నేత‌లు ఆయ‌న‌ను స్మ‌రించారా? కానీ, ఇప్పుడు ఎందుకు ఆయ‌న బాకా ఊదుతున్నారు? ఇదీ.. ఇప్పుడు కాపు నాడు నాయ‌కులు అడుగుతున్న ప్ర‌శ్న‌లు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఏది దొరికితే.. దానిని ప‌ట్టుకుని వేలాడ‌డం కామ‌నే.

కానీ, బ‌ల‌మైన నాయ‌కుడుగాఉన్న రంగాను ప‌ట్టుకుని వేలాడేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం.. అంత స‌బ‌బుగా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం కొన్ని రోజులుగా బీజేపీ నాయ‌కుడు.. ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు.. వంగ‌వీటి విష‌యంలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మ‌రి కాపులు త‌మ‌వైపు చూడాల‌ని ఆయ‌న చేస్తున్నారో.. లేక‌..లేనిపోని వివాదం సృష్టించి.. రాష్ట్రంలో రాజ‌కీయ అల‌జ‌డి సృష్టించాల‌ని అనుకుంటున్నారో తెలియ‌దు.,

కానీ, అటు పార్ల‌మెంటులోనూ.. ఇటు బ‌హిరంగ వేదిక‌ల‌పై కూడా..రంగా పేరును తెగ‌వాడేస్తున్నారు. కృష్ణ జిల్లాలోని ఒక ప్రాంతానికి రంగా పేరు పెట్టాల‌ని కొన్ని రోజుల కింద‌ట రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నించారు. ఆ వెంటనే చైర్మ‌న్‌.. ఇది రాష్ట స‌బ్జెక్టు కాబ‌ట్టి రికార్డుల్లోంచి తీసేస్తున్నాన‌ని చెప్పారు. ఏదో బ‌తిమాలుకుని రికార్డుల్లో ఉంచ‌గ‌లిగినా.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లోకి మాత్రం జీవీఎల్ వెళ్ల‌లేక పోయారు.

ఇక‌, తాజాగా మ‌రోసారి క‌న్నా వ్య‌వ‌హారంపై మాట్లాడుతూ.. జిల్లాల‌కు అనేక మంది పేర్లు పెట్టార‌ని అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , వైఎస్‌ల పేర్లు ఎత్తకుండానే అన్ని ప‌థ‌కాల‌కు వారి పేర్లేనా? అంటూ నిష్టూరం పోయారు. ఒక్క‌ జిల్లాకైనా రంగా పేరు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌న్నారు. ఓకే పెట్టార‌ని అనుకున్నా.. కాపులు ఏమైనా బీజేపీకి అనుకూలంగా మార‌తారా? అనేది ప్ర‌శ్న‌. ఎట్టి ప‌రిస్థితిలోనూ మారే ప్ర‌స‌క్తే లేదు. కాపుల రిజ‌ర్వేష‌న్ విష‌యంలో నాడు ఏమీ తేల్చ‌కుండా.. తొక్కిపెట్టిన‌ప్పుడే.. కేంద్రంలోని బీజేపీని కాపులున‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని అంటున్నారు.

పైగా.. కాపు నాయ‌కుడిగా ఉన్న క‌న్నాను.. అవ‌మానించ‌డం.. ఆయ‌న నియ‌మించిన పార్టీ నేత‌ల‌ను తొల‌గించిన నాడే వారంతా దూర‌మ‌య్యారనేది వాస్త‌వం. కాగా.. నేడు క‌న్నా పార్టీ దూరం అవుతున్న నేప‌థ్యంలో కాపులు ఎక్క‌డ బీజేపీపై విరుచుకుప‌డ‌తారో.. అని భావించిన జీవీఎల్ అనూహ్యంగా రంగా పేరును తెర‌మీదికి తేవ‌డం ఆస‌క్తిగా మారిందే కానీ… ఫ‌లితం ఇచ్చేలా కనిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.