ఎన్టీఆర్‌పై ఎడ‌తెగ‌ని ప్రేమ‌.. మోడీ వ్యూహం ఏంటి?

ఎన్టీఆర్‌.. ఇది మూడ‌క్ష‌రాల పేరే కాదు.. దేశం మొత్తాన్ని స‌మైక్యం చేసిన పేరు కూడా! సినీ రంగంలో త‌న‌కంటూ.. చ‌రిత్ర‌ను లిఖించుకున్న విశ్వ‌విఖ్యాత న‌టుడే కాదు.. రాజ‌కీయంగా బ‌డుగులు.. బ‌ల‌హీన వ‌ర్గాల పాలిట దేవ‌దేవుడిగా పేరొందిన మ‌హోన్నత నాయ‌కుడు… నంద‌మూరి తార‌క‌రామారావు. జాతీయ‌స్థాయిలో నేష‌న‌ల్ ఫ్రంట్ త‌ర‌ఫున చ‌క్రం తిప్పి.. కాంగ్రెస్‌ను అధికారంలో నుంచి దింపేసిన రాజ‌కీయ యోధుడు కూడా! అయితే.. ఇప్పుడు ఈయ‌న పేరును బీజేపీ పెద్ద‌లు ప‌దే ప‌దే స్మ‌రిస్తున్నారు.

ఇటీవ‌ల పార్ల‌మెంటులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఎన్టీఆర్ పేరును సుమారు 6 సార్లు ఉచ్ఛ‌రించారు. “ఎన్టీఆర్‌కు అన్యాయం చేశారు. ఎన్టీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేశారు. ఎన్టీఆర్ తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం. అలాంటి ఎన్టీఆర్ కు కూడా.. సీట్లు ఓట్లు లేని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఆయ‌న‌కు వెన్నుపోటు పొడిచింది” అంటూ మోడీ క‌న్నీరు పెట్టుకున్నంత ప‌నిచేశారు. ఈ ప‌రిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ విష‌యంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల వేళ ఎన్టీఆర్ చిత్రంతో కూడిన 100 రూపాయ‌ల‌ వెండి నాణెం ముద్రణకు మోడీ స‌ర్కారు ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ విష‌యాన్ని హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఇప్ప‌టికే త‌న‌ నుంచి మింట్‌(నాణేల ముద్ర‌ణాల‌యం) అధికారులు సలహాలు, సూచనలను స్వీకరించారని ఆమె చెప్పారు. ఎన్టీఆర్‌ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరానని ఆమె చెప్పారు.

నిర్మలా సీతారామన్‌ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో చ‌ర్చించి.. నాణెం ముద్ర‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించారు. ఈ నేపథ్యంలో మింట్‌ నుంచి ఆమోదం వచ్చిందని.. సంబంధిత అధికారులు 3 ఫొటోలను పరిశీలించారని తెలిపారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే విడుదల చేస్తారని ఆమె వివరించారు. ఈ ప‌రిణామం.. అన్న‌గారి అభిమానుల‌కు ఆనంద‌దాయ‌క‌మ‌న‌డంలో సందేహం లేదు.

క‌ట్ చేస్తే..
అయితే.. ఈ విష‌యంలో కేంద్రం ఇంత వెంట‌నే రియాక్ట్ కావ‌డం.. ఎన్టీఆర్‌పై ఇటీవ‌ల కాలంలో తెగ ప్రేమ‌ను కురిపించ‌డం చూస్తే.. దీని వెనుక రాజ‌కీయ వ్యూహం ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న బీజేపీ.. సెటిల‌ర్ల ఓట్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. ఎన్టీఆర్ బొమ్మ‌ను వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. ఏపీలోనూ.. ఎదిగేందుకు దీనిని వినియోగించుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఊర‌క‌రారు మ‌హానుభావులు..అన్న‌చందంగా.. మోడీ వారు ఏం చేసినా.. ఊరికేనే చేయ‌రు క‌దా!! అంటున్నారు ప‌రిశీల‌కులు.