మిస్ట‌ర్ జ‌గ‌న్ రెడ్డీ వీరిని చూశావా..

“మిస్ట‌ర్ జ‌గ‌న్ రెడ్డీ వీరిని చూశావా?” అంటూ.. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో ఉంచారు. ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫొటో విష‌యాన్ని పేర్కొంటూ.. నారా లోకేష్ ఏమ‌న్నారంటే..

“మిస్ట‌ర్ జ‌గ‌న్ రెడ్డీ నేను తెచ్చిన డిక్స‌న్ కంపెనీ ఇది. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా? ఒక్క ఉద్యోగ‌మైనా ఇప్పించ‌గ‌లిగాన‌ని ప్ర‌క‌టించ‌గ‌ల‌వా?” అని లోకేష్ స‌వాల్ విసిరారు. లోకేష్ గ‌త నెల 27న ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్ర‌స్తుతం స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది.

ఈ స‌మ‌యంలో లోకేష్ పాద‌యాత్ర‌గా వెళ్తుండ‌గా.. ఇదే దారిలో డిక్స‌న్ కంపెనీ బ‌స్సు ఎదురైంది. దీంతో లోకేష్ ఆ బ‌స్సును ఆపి.. అందులోకి ఎక్కారు. ఆ బ‌స్సు నిండా మ‌హిళ‌లు క‌నిపించారు. వీరంతా డిక్స‌న్ కంపెనీలో ప‌నిచేస్తున్నారు. దీంతో వారిని ప‌ల‌క‌రించిన నారా లోకేష్‌.. ఉద్యోగాలు చేస్తున్న‌వారి వివ‌రాలు తెలుసుకున్నారు.

అనంత‌రం.. ఆయ‌న నాలుగేళ్ల క్రితం నేను ఐటీ-ఎల‌క్ట్రానిక్స్ శాఖా మంత్రిగా తీసుకొచ్చిన కంపెనీ ఈ రోజు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. నేను ఇప్పుడు ప‌ద‌విలో లేను. కానీ నా ప్ర‌య‌త్నం వేలాది మంది జీవితాల‌కు ఉపాధి మార్గం చూపింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఒక వ‌న‌రు అయ్యింది. ఆంధ్ర అభివృద్ధిలో డిక్స‌న్ కూడా ఒక భాగ‌మైంది అని పేర్కొన్నారు.

“చిలుకను పెంచాను ఎగిరిపోయింది. ఉడుత‌ను పెంచాను పారిపోయింది. మొక్కను పెంచాను. ప్రస్తుతం ఆ రెండూ వచ్చి చేరాయి” అని మిసైల్ మేన్, మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం చెప్పిన నిత్య‌స‌త్యం నేను న‌మ్మే సిద్ధాంతం. మీలాంటి వారి విమ‌ర్శ‌లు-ఆరోప‌ణ‌లు-హేళ‌న‌ల‌కు వెర‌వ‌కుండా అష్ట‌క‌ష్టాలు ప‌డి తెచ్చిన కంపెనీలు ప‌చ్చ‌ని చెట్లు అయ్యాయి. ఈ నీడ‌న ఉపాధి దొరుకుతోంది. ఇంత‌కుమించిన ఆనందం ఏముంటుంది. అని పేర్కొన్నారు.

అప్ప‌ట్లో డిక్స‌న్‌ 100 కోట్ల పెట్టుబడి పెట్టింద‌న్నారు. ఈ కంపెనీ వ‌ల్ల 1000 మందికి ప్రత్యక్షంగా, 5000 పరోక్ష ఉపాధి దొరికిందని నారా లోకేష్ చెప్పారు. టీడీపీ హ‌యాంలో ప‌దుల‌సంఖ్య‌లో కంపెనీలు తెచ్చి వేలాది మందికి ఉపాధి క‌ల్పించామ‌న్నారు. అన్ని కాక‌పోయినా ఒక్క కంపెనీ తెచ్చి యువ‌త‌కి ఉపాధి క‌ల్పించి చూపించ‌గ‌ల‌వా మిస్ట‌ర్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డీ అని లోకేష్ స‌వాల్ విసిరారు.