దేశంలో ఏపీనే నెంబ‌ర్ 1: జ‌గ‌న్

దేశంలో ఏపీనే నెంబ‌ర్ 1- అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అంతేకాదు..దేశానికి ఏపీ దిశానిర్దేశం చేస్తోంద‌ని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు.

దేవుడి దయతో వైఎస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్‌ అన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్‌. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారు. వైఎస్సార్‌ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు.

రూ.8,800 కోట్లతో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్లాంట్‌ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చిందని, అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయన్నారు. స్టీల్‌ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్‌ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుందని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

క‌డ‌ప‌లో రూ.700 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ తొలి దశ పూర్తవుతుందని, మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ఇవ్వాలని చట్టం కూడా తెచ్చామ‌న్నారు. సున్న‌పురాళ్ల ప‌ల్లెలోని క‌న్య‌తీర్థంలో జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమక్షంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. అయితే.. ఇప్ప‌టికే ఒక‌సారి 2019లో ఆయ‌న ఉక్కు ఫ్యాక్ట‌రీకి శంకు స్థాప‌న చేసిన విష‌యంపై నోరు విప్ప‌క పోవ‌డం గ‌మ‌నార్హం.