తమిళనాడు పాలిటిక్స్ వద్దంటున్న లోకేష్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. ప్రతీచోట జన ప్రభంజనం కనిపిస్తోంది. పంచ్ డైలాగులతో లోకేష్ జనాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. సైకో ముఖ్యమంత్రిని గద్దె దించే రోజు వచ్చిందని అందరికీ చెబుతున్నారు. తాము అధికారానికి వస్తే చేయబోయేదేమిటో చెబుతున్నారు..

డైమండ్ పాప టు జబర్దస్త్ ఆంటీ

లోకేష్ ఇప్పుడు రోజాకు టైటిల్ మార్చేశారు. ఇంతకాలం డైమండ్ రాణి, డైమండ్ పాప అని పిలిచిన లోకేష్ ఇప్పుడు రూట్ మార్చారు. డైమండ్ పాప అంటే రోజా నొచ్చుకుంటున్నారట. అందుకనే అమెను ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ అని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో జబర్దస్త్ ఆంటీ అరాచకాలను ఆయన ఏకరవు పెట్టారు. గ్రావెల్, గ్రానైట్ వ్యాపారాలను ఎండగడుతున్నారు.

పదేళ్లు అవకాశం ఇవ్వండి

వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడంతో పాటు పదేళ్లు అధికారంలో ఉండి ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరుతున్నారు. పదేళ్లు అనడానికి ఒక కారణం ఉంది. తమిళనాడులో ఎంజీఆర్ మరణానంతరం అధికారం డీఎంకే, అన్నాడీఎంకే మధ్య దోబూచులాడింది. ఒక్క సారి మినహా ప్రతీ సారీ అధికార పార్టీ ఓడిపోతూనే ఉంది. జయలలిత, కరుణానిధి మధ్య అధికారం మారతూ ఉండేది. దీని వల్ల సంక్షేమం దెబ్బతిన్నదన్న విశ్లేషణలు వినిపించాయి. లోకేష్ చెబుతున్నది కూడా అదే. ఇప్పటికే జగన్ చేసిన డేమేజ్ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ఐదేళ్లు చాలవని కనీసం పదేళ్లు అధికారంలో ఉండాలని ఆయన అంటున్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటే టైమ్ పడుతుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు…