కోటంరెడ్డి ఎఫెక్ట్‌… టీడీపీ మాజీ మంత్రి నారాయ‌ణ అవుట్‌…!

నెల్లూరు రాజ‌కీయాలు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వారు వీరు అవుతున్నారు.. అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి . నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బ‌హిరంగంగానే టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించడం ..వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అవ‌కాశం ఇస్తే.. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫునే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం తెలిసిందే. ఆయ‌న చెప్ప‌డం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, దీనిని సాకారం చేయ‌డం ఇప్పుడు చంద్ర‌బాబుకు త‌ల‌కు మించిన భారంగా మారింద‌ని అంటున్నారు.

దీనికి కార‌ణం.. త‌న‌కు నెల్లూరు రూర‌ల్ టికెట్ కావాల‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన అజీజ్ పేర్కొంటున్నారు. తాజాగా ఆయ‌న చంద్ర‌బాబుకు ర‌హ‌స్య లేఖ రాసిన‌ట్టు స‌మాచారం. కోటంరెడ్డికి టికెట్ ఇచ్చినా.. ఆయ‌న ఓడిపోతార‌ని.. ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త ఉంద‌ని.. వైసీపీని న‌మ్మొద్ద‌ని కూడా ఆయ‌న లేఖ‌లో పేర్కొ న్న‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో ఇన్నాళ్లుగా తాను ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉన్నాన‌ని.. ఇప్పుడు త‌న‌ను కాదంటే ఎలా అని కూడా అజీజ్ ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

అయితే.. చంద్ర‌బాబు మ‌రో వ్యూహంతో ఉన్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుంచి అజీజ్‌ను పోటీకి దింపాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు లీకులు ఇస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి పి. నారాయ‌ణ ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయ‌న అంత ఉత్సాహంగా క‌నిపించ‌డం లేదు. రాజకీయాల ప‌ట్ల ఆస‌క్తి కూడా లేద‌ని చెబుతున్నారు. దీంతో ఈ సీటును అజీజ్‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌.

అయితే.. దీనిని కూడా అజీజ్ ముందుగానే లెక్క‌లు వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. సిటీ నుంచి పోటీ చేసి తాను బ‌లి కాలేన‌ని.. ఇప్ప‌టికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాన‌ని.. వచ్చే ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టుకుని.. మ‌రోసారి ఓడిపోయి.. కోరి క‌ష్టాలు తెచ్చుకోలేన‌ని చెబుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు అజీజ్ విష‌యంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ని అంటున్నారు. కాదంటే.. మైనార్టీ వ‌ర్గాలు ఆగ్ర‌హించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ప్ర‌స్తుతానికి మౌనంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.