కేసీఆర్ నోట ‘బటన్’ మాట

నాందేడ్ బహిరంగ సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మేక్ ఇన్ ఇండియా పథకం జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందంటూ భారీ సెటైర్ వేశారు. అంతేకాదు.. చైనాను బూచిగా చూపుతూ ఓట్లు రాబట్టకుంటున్న బీజేపీ చిన్న విషయానికి కూడా చైనాపైనే ఆధారపడుతోందని ఆరోపించారు. గాలిపటానికి కట్టే దారం నుంచి జాతీయ జెండా వరకు అన్నీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న ఊళ్లలోనూ ఇప్పుడు చైనా బజార్లు ఉన్నాయంటే ఆ దేశంపై ఎంతగా ఆధారపడుతున్నామో అర్థమవుతోందని, ఇంకా మేక్ ఇన్ ఇండియా జోక్ కాకపోతే ఏమిటని అన్నారు. ఒక్క బటన్ నొక్కి బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు.

రైతుల ఆత్మహత్యలకూ కేంద్రానిదే తప్పని కేసీఆర్ నిందించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉండడం దారుణమన్నారు. దీనికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. చాలా దేశాల్లో 5 వేల టీఎంసీలకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులున్నాయని.. కానీ, ఇండియాలో ఇంత పెద్ద నదులున్నా అలాంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఎందుకు లేదని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులు నాగలి పట్టి దున్నడమే కాదు అధికారం చేపట్టి చరిత్ర తిరగరాయాలని అన్నారు.

మహారాష్ట్ర జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చూపించాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.కేవ‌లం ఒక్క బ‌ట‌న్ నొక్కండి.. దేశ‌మంతా మారిపోతోంది అని కేసీఆర్ అన్నారు. మ‌హారాష్ట్ర‌లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. అవ‌న్నీ ప‌రిష్కారం కావాలి. నా మాట‌ల్లో నిజం ఉంది. గులాబీ జెండా భుజాన వేసుకుని క‌ద‌లిరండి అని పిలుపునిచ్చారు. దేశ‌మంతా గులాబీ జెండా ఎగ‌రాలి.. కిసాన్ స‌ర్కార్ రావాలి. మ‌హారాష్ట్రలో ఊరురా కిసాన్ క‌మిటీలు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో మ‌హారాష్ట్ర అంతటా ప‌ర్య‌టిస్తాన‌ని కేసీఆర్ తెలిపారు.