నంద్యాల సెంటర్లో ఫిబ్రవరి 4 డెడ్ లైన్

భూమా, శిల్పా కుటంబాల మధ్య మళ్లీ పొలిటికల్ వార్ మొదలైంది. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం అన్నట్లుగా మాటల యుద్ధం ఊపందుకుంది. నువ్వెంత ఎంత నువ్వెంత అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.

నంద్యాల యువ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే తమ ఆధిపత్యం తగ్గిపోతుందని భూమా కుటుంబం ఆందోళన చెందుతోంది. టీడీపీ నంద్యాల టికెట్ శిల్పాకు ఇస్తే తాము ఆళ్లగడ్డకే పరిమితం కావాల్సి ఉంటుందని అఖిలప్రియ భయపడుతున్నారు. దానితో ఆమె నాలుగు మాటలు అంటే శిల్పా ఎనిమిది సమాధానాలు చెబుతున్నారు. అక్కడే రచ్చ మొదలైంది.

నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో… ప్రత్యర్థి వర్గమైన భూమా కుటుంబంపై ఎమ్మెల్యే శిల్పా రవి ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. నంద్యాలలో తాను పంచాయతీలు చేసి పర్సంటేజీలు తీసుకోలేదని, ఎన్నికల్లో వ్యాపారుల నుంచి డబ్బులు దండుకోలేదని, కాంట్రాక్టర్లను బెదిరించి దందాలు చేయలేదన్నారు ఎక్కువ మాట్లాడితే చిట్టా విప్పాల్సి వస్తుందని… తనపై విమర్శలు చేసేవారు ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాలని.. రెచ్చిపోతే అంతకంటే ఎక్కువగా రెచ్చిపోతానని ఎమ్మెల్యే శిల్పా రవి మండిపడ్డారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని ఎమ్మెల్యే శిల్పా రవి హెచ్చరించారు. ఇవన్నీ భూమా ఫ్యామిలీపై చేసిన కామెంట్సేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి.

ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు టైం ఇస్తున్నామని తనపై చేసిన దౌర్జన్యాలు, కబ్జాల ఆరోపణలను ఆధారాలతో సహా బయట పెట్టాలని అఖిల ప్రియ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రవి రాజీనామా చేసి రావాలని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకుందామని అఖిలప్రియ సవాలు చేశారు. మీ నాన్నకు రాజకీయ బిక్ష పెట్టింది ఎవరో అడగాలని ఎమ్మెల్యే రవికి అఖిలప్రియ సూచించారు. టిడిపి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో..మీ ప్రభుత్వంలో ఏ మేరకు డెవలప్మెంట్ చేశారో ఓపెన్ గా డిబేట్లో చర్చించు కుందాం రా అని భూమా బ్రహ్మానందరెడ్డి సైతం ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ చేశారు.

ఇప్పుడు నంద్యాల రాజకీయాలు కాకమీదున్నాయ్. శిల్పా రవి చూపు టీడీపీ వైపు ఉందని, తమ పార్టీ నాయకులతో ఆయన టచ్ లో ఉన్నారని అఖిలప్రియ ఓపెన్ గా చెప్పెయ్యడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో వీధి పోరాటాలు మొదలవుతాయని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి..