జ‌గ‌న్ యాక్ష‌న్‌.. ర‌ఘురామ రియాక్ష‌న్‌.. అదిరిపోయిందిగా!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు.. ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యం తెలిసిం దే. ఇప్ప‌టికే ర‌ఘురామ‌.. సీఎం జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని ఒక‌సారి కోర్టులో కేసు వేశారు. ఇక‌, ర‌ఘురామ‌ను అరెస్టు చేయించి కొట్టించార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై ర‌ఘురామ రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ యాక్ష‌న్ అంటే..ర‌ఘురామ రియాక్ష‌న్ అన్నారు. దీంతో విష‌యం ఇప్పుడు సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టింది.

విష‌యం ఏంటంటే..

ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు హుటాహుటిన లేఖ రాశారు. విశాఖ రాజధాని అని ప్రకటించి సీఎం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని లేఖలో తెలిపారు. రాజధానిపై సుప్రీంలో కేసు విచారణలో ఉన్న సమయంలో.. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ర‌ఘురామ‌ వివరించారు. వీటిపై చర్యలు తీసుకో వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో విన్నవించారు. మ‌రోవైపు, జగన్ విశాఖకు మారితే ఆయన ఇంటి చిరునామా మాత్రమే మారుతుందని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు. రాజధాని మార్పు అనేది అసాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగినా ప్రయోజనం శూన్యమని విమర్శించారు.

కోర్టులు, రాజ్యంగాన్ని జగన్ అపహాస్యం చేశారన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడితే.. ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు. ఇదిలావుంటే.. ఢిల్లీలో నిర్వ‌హించిన ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల స‌న్నాహ‌క స‌ద‌స్సులో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీన నేను విశాఖకు వెళ్తున్నాను.. నాతో పాటు మీరు కూడా విశాఖకు రావాలని ప‌లు దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ర‌ఘురామ త‌న లేఖ‌కు జత చేశారు.