వివేకా హత్య కేసులో వైఎస్ భారతిని ప్రశ్నిస్తారా ?

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడేళ్లు దాటింది. ఆయన్ను ఎవరు చంపారో ఇంతవరకు దర్యాప్తు సంస్థలు కనిపెట్టలేకపోయాయి. తొలుత స్టేట్ పోలీసులు, తర్వాత సిట్,ఇప్పుడు సీబీఐ అహర్నిశలు శ్రమ పడుతున్నా కేసు ఒక కొలిక్కిరాలేదు. సీబీఐ కూడా తొలి నాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇప్పుడు కాస్త స్పీడు పెంచింది. మొట్ట మొదటిసారిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించి కొంత మేర సక్సెస్ సాధించింది.

నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో అనేక ప్రశ్నలకు అవినాష్ సమాధానాలు చెప్పినా కాల్ డేటా విషయంలో మాత్రం తప్పించుకోలేకపోయారని సీబీఐ నుంచి లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 2019 మార్చి 15న హత్య జరిగిన రోజు కాల్ డేటా ఈ కేసుకు కీలకమవుతుందని సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు.

వివేకా హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ రెండు నెంబర్లకు కాల్ చేశారు. ఆ నెంబర్ల వివరాలు అవినాష్ ను సీబీఐ అధికారులు అడగడంతో తొలుత ఆయన నీళ్లు నమిలారు. తర్వాత ఒక నెంబర్ నవీన్ అనే వ్యక్తిదని వెల్లడించారు. సీఎం జగన్ భార్య వైఎస్ భారతితో మాట్లాడాలంటే నవీన్ కు ఫోన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దానితో వివేకా హత్య జరిగిన రోజున, ఆ తర్వాత అవినాష్ పలు పర్యాయాలు భారతితో మాట్లాడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారించారు. అలాగే జగన్ తో మాట్లాడాలంటే మరో వ్యక్తికి ఫోన్ చేయాల్సి ఉంటుందని అవినాష్ వెల్లడించారు.

అవినాష్ నుంచి వివరాలు సేకరించిన తర్వాత సీబీఐ అధికారులు నవీన్ సహా మరో వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే హాజరు కావాల్సిన తేదీలు మాత్రం వెల్లడి కాలేదు. ఈ వారంలోనే ఆ పని జరిగిపోతుందని వార్తలు వస్తున్నాయి. నవీన్ ను ప్రశ్నించి అతను ఇచ్చిన సమాధానాలు అనుమానాస్పదంగా ఉంటే వైఎస్ భారతిని విచారణకు పిలుస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవినాష్ రెడ్డికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన తర్వాత వచ్చే సమాధానాల ఆధారంగా కూడా భారతికి నోటీసులు వెళ్లే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

హత్య జరిగిన రోజున సాక్ష్యాలు చెరిపేసేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారన్న ఆరోపణల వస్తున్నాయి. బాబాయిని వైఎస్ జగనే చంపించాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసులో లోతైన విచారణ చేయాలని సీబీఐ నిర్ణయించింది. సీబీఐ విచారణను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోవడంతో జగన్ బ్యాచ్ టెన్షన్ పడుతోంది…