లోకేష్ పాద‌యాత్ర‌పై ఆయ‌న మిత్రుడి కామెంట్స్ ఇవే!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై ఆయ‌న మిత్రుడు, వైసీపీ నాయ‌కుడు, దేవినేని అవినాష్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకు అయిన తెలుసా? అని ప్ర‌శ్నించారు. పాదయాత్ర చేసేది ప్రజలను మోసం చేయటానికా, టీడీపీ ని అధికారంలోకి తీసుకు రావటానికా? ఈ సారైనా ఎంఎల్ఏగా గెలవటానికా? అని వ్యాఖ్యానించారు.

టీడీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు యువత, విద్యార్థుల కోసం ఏం చేశారో చెప్పాలని అవినాష్ ప్ర‌శ్నించారు. మ్యానిఫెస్టోలో అంశాలు కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు. స్కాలర్ షిప్ లు, నిరుద్యోగ భృతి అని చెప్పినా అవి కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. సంక్షే మ పథకాలు అందాలంటే వారికి కమీషన్లు ఇవ్వాలని, వారు పెట్టిన షరతులు పాటించాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు.

లోకేష్ ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెబుతారని అవినాష్ చెప్పుకొచ్చారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ సొంతమ‌ని చెప్పారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్న తీరు చూస్తుంటే ఈయ‌నే రాష్ట్రంలో తొలిసారి పాదయాత్ర చేస్తున్నట్లుగా ఉంద‌న్నారు. పాదయాత్ర అనేది ప్రజల కష్టాలు,వారి సమస్యలు తీర్చే విధంగా ఉండాలని అన్నారు. జగన్ ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చార‌ని, కాబట్టే దేశంలో ఏ పాదయాత్రకు రాని గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.

పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్‌ కుటుంబమేన‌ని చెప్పుకొచ్చారు. లోకేష్ పాదయాత్రలో నాడు నేడు స్కూల్స్, జగనన్న కాలనీలు, అనేక ప్రాంతాల్లోజరిగిన అభివృద్ధి పనులు చూడటానికి ఆయనకు ఇదొక అవకాశమ‌ని చెప్పారు. జగన్ పాదయాత్రతో లోకేష్ పాదయాత్రని పోల్చటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ ని సింగిల్‌గా ఎదుర్కొనే దమ్ములేక గుంపులుగా వస్తున్నార‌ని అవినాష్ వ్యాఖ్యానించారు. కాగా, దేవినేని నెహ్రూ టీడీపీలో ఉన్న స‌మ‌యంలో నారా లోకేష్‌.. దేవినేని అవినాష్ ఇద్ద‌రూ ఫ్రెండ్స్ కావ‌డం గ‌మ‌నార్హం.