కిక్కిరిసిన కొండ‌గ‌ట్టు.. ప‌వ‌న్ యాత్ర షురూ!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. యాత్ర‌కు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాను ప్ర‌త్యేకంగా త‌యారు చేయించుకున్న వారాహి వాహనానికి తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఉన్న‌ కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేయించారు. ఈ క్ర‌మంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు, పార్టీ నేత‌లు పోటెత్తారు.

జనసైనికులు భారీ కాన్వాయ్‌తో రాగా పవన్ అంజన్న సన్నిధికి చేరుకున్నారు. జనసేనాని ప్రచార రథం వారాహికి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. వేద పండితులు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో జనసేనాని సమావేశమవుతారు.

అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యే క పూజలు చేస్తారు. అక్కడి నుంచే అనుష్టుప్‌ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. అనంత‌రం.. దీనిని ఈ నెల చివ‌ర‌లో లేదా.. వ‌చ్చే నెల మొద‌టి వారంలోనో.. ఏపీలోకి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. ఏపీలోని తిరుమ‌ల, అదేవిధంగా బెజ‌వాడ దుర్గ‌మ్మ‌, అన్న‌వ‌రం స‌త్య‌దేవుని స‌న్నిధిల్లో కూడా ఈ వారాహి.. వాహ‌నానికి పూజ‌లు చేయించ‌నున్న‌ట్టు ఏపీ జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపాయి.

త‌ర్వాత ఏపీలో యాత్ర ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. దీనికి కొంత స‌మ‌యం తీసుకున్నా.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మాత్రం యాత్ర‌ప్రారంభ‌మైన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే, మొత్తం 32 నియోజ‌క‌వ ర్గాల్లో తెలంగాణ‌లో పోటీ చేయాల‌ని.. ప్రాథ‌మికంగా జ‌న‌సేన అధినేత నిర్ణ‌యించుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాలు ఏంటి? ఎవ‌రెవ‌రు ఎలా పోటీకి దిగాలి .. అనే విష‌యంపైనా ఆయ‌న పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నారు.