లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ

కుప్పం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అభివృద్ధికి పర్యాయపదంగా నిలిచిన అసెంబ్లీ సెగ్మెంట్. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచే కుప్పం టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలన్న విశ్వ ప్రయత్నం జరుగుతూనే ఉంది.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనే ఓడించాలన్న ఉద్దేశంతో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి కుప్పం ప్రజల్లో చీలిక తెచ్చేందుకు సంకల్పించారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో.. వైసీపీ పుణ్యమా అని.. ఆ వాతావరణమే లేకుండా పోయింది. దీంతో.. వైసీపీ అరాచకాలపై టీడీపీ వీరోచిత పోరాటం చేయాల్సి వస్తోంది. అక్రమ కేసుల కారణంగా టీడీపీ శ్రేణులు జైళ్ళకు వెళ్ళక తప్పడం లేదు.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ ఎదురు ఎత్తుగడలు వేస్తూనే ఉంది. కుప్పం టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబు.. మూడు, నాలుగు నెలలకొకసారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి లాంటి కార్యక్రమాల ద్వారా టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ముందెన్నడూ లేని విధంగా చంద్రబాబు సభలకు విశేష స్పందన లభిస్తోంది. ఆయన కుప్పం వెళ్లిన ప్రతీసారి వైసీపీ నేతలు కవ్వింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. పోలీసులను ఉసిగొల్పి చంద్రబాబు కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పంపై దృష్టిపెట్టి చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. చంద్రబాబు గట్టిగా రిటార్డిచ్చి ఖబద్దార్ జాగ్రత్త అని చెప్పినా పెద్దిరెడ్డి తీరు మాత్రం మారడం లేదు. తాజాగా.. జోవో నెంబర్ వన్ తీసుకొచ్చిన వైసీపీ.. ఈ నెల 4, 5, 6 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంది. టీడీపీ శ్రేణులపై లాఠీలు ఝుళిపించడంతో పలువురు గాయాలు అయ్యాయి. పోలీసులు మాత్ర బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

ఇప్పుడు ఫోకస్ పాదయాత్రపై పడింది. ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కుప్పం నుంచే యువగళం గర్జన పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పాదయాత్రను నిర్వీర్యం చేయాలని సీఎం జగన్ స్వయంగా తమ పార్టీ నేతలను ఆదేశించారు. ప్రస్తుతం ఆ పని రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి కుమారుడైన మిథన్ రెడ్డి ఒకటి రెండు సార్లు కుప్పంలో పర్యటించి స్థానిక నేతల మీటింగులు ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని అందుకు వైసీపీ కార్యకర్తలందరి మద్దతు కావాలని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. పైగా లోకేష్ యాత్రా ఏర్పాట్లను మిథున్ రెడ్డి వాకబు చేశారు. లోకేష్ యాత్రకు పెద్దగా స్పందన ఉండదని చెబుతూ, వైసీపీ శ్రేణులు కూడా అలాంటి ప్రచారమే చేయాలని మిథున్ రెడ్డి తమ కార్యకర్తలకు సూచించారు. వీలైనంత వరకు కుప్పం నుంచే లోకేష్ కు టెన్షన్లు సృష్టించాలన్న కోరిక వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. మీరు దూకుడుగా ఉండండి…వెనుక నుంచి మా మద్దతు ఉంటుందని మిథున్ రెడ్డి తమ పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నట్లు సమాచారం..