సొంత ఎంపీపై అన్ని కేసులా.. ఆశ్చ‌ర్య‌పోతున్న వైసీపీ నేత‌లు

ఆయ‌న సొంత ఎంపీ. ఏరికోరి గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను పిలిచి మ‌రీ టికెట్ ఇచ్చారు. ఆయ‌న నుంచి ఆర్థికంగా కొంద‌రు నేత‌ల‌కు కూడా సాయం చేయించార‌నే టాక్ ఉంది.అయితే.. ఇప్పుడు అలాంటి నేత‌పై విప‌క్షాల‌ను మించిపోయిన రీతిలో ఏపీ ప్ర‌భుత్వం కేసులు పెట్టింది. ఈ ప‌రిణామం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లోనే ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

విష‌యం ఏంటంటే.. వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కొన్నాళ్లుగా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై గ‌ళం వినిపిస్తున్నారు. దీంతోప్ర‌భుత్వానికిఆయ‌న‌కు మ‌ధ్య వాతావర‌ణం విక‌టించింది. దీంతో ఒక సంద‌ర్భంలో సీఐడీ పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. కొట్టార‌ని ఆయ‌న ఆరోపించ‌డం తెలిసిందే. ఇక‌, ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం-ఎంపీ మ‌ధ్య మ‌రింత‌గా వివాదం కొన‌సాగుతూనే ఉంది.

ఈ క్ర‌మంలో ఏపీకి వ‌చ్చేందుకు కూడా ఎంపీ జంకుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో అస‌లు త‌న‌పై ఎన్ని కేసులుపెట్టారో తెలుసుకునేందుకు ఎంపీ ర‌ఘురామ హైకోర్టును ఆశ్ర‌యించారు. ‘తనపై ఉన్న కేసు వివరాలను, ఫిర్యాదుల సమాచారాన్ని ఇవ్వాలి’ అని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్ని కేసులు పెట్టారో చెప్పాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో స్పందించిన హోం శాఖ‌.. ఎంపీపై 11 ఎఫ్ఐఆర్‌‌లు ఉన్నాయని తెలిపింది.

అయితే.. ఎవ‌రు ఫిర్యాదులు చేశారు? ఎందుకు చేశారు? అనే విష‌యాల‌ను చెప్ప‌లేదు. దీంతో ఎఫ్ఐఆర్‌ వివరాలతో పాటు, రిజిస్టర్ కాని ఫిర్యాదులను ఎందుకు ఇవ్వకూడదో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వివ‌రాల మేర‌కు..

తమను, తమ సహచర ఎమ్మెల్యేలను ఎంపీ రఘురామ కించపరిచేలా మాట్లాడారని, తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేశారని.. పోడూరు పోలీసు స్టేషన్‌లో మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరం పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రఘురామ కృష్ణరాజుపై 2020 జులై నెలలో ఫిర్యాదులు చేశారు. ఇవి కాకుండా.. మ‌రిన్ని కేసులు పెట్టార‌నేది ఎంపీ వాద‌న‌. మ‌రి ఏం తేలుతుందో చూడాలి.