మోడీ ఢీకొట్టే స‌త్తా కేసీఆర్‌కు లేద‌ని తేలిపోయిందా…!

తాజాగా ఖ‌మ్మం వేదిక‌గా.. తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత కేసీఆర్ నిర్వ‌హించిన ఆవిర్భావ స‌భ హిట్టా ఫ‌ట్టా అనేది ప‌క్క‌న పెడితే.. ఈ స‌భావేదిక‌గా.. కేసీఆర్ చేసిన రెండు వ్యాఖ్య‌లు.. రెండు అంశాలు ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీశాయి. ఒక‌టి విశాఖ ఉక్కు విష‌యం. రెండు జ‌ల వినియోగం. ఈ రెండు కూడా లోక‌ల్ ఇష్యూలే. అయితే.. ఈ రెండు విష‌యాల్లోనూ… కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో మోడీని ఢీకొట్ట‌డం వీరి వ‌ల్ల కాద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఒకింత చిత్రంగా ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌మే. ఎందుకంటే.. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలోని ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిని అడ్డుకునేం దుకు ఇక్క‌డి ఉద్యోగులు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రం మాత్రం ముందుకే సాగుతా మ‌ని తేల్చి చెబుతోంది. అయితే.. ఈ క్ర‌మంలో ఏపీ త‌ర‌ఫున సీఎం జ‌గ‌న్ ఇలా చేయొద్దంటూ.. లేఖ‌లు సంధించారు.

ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ తాజాగా.. చేసిన ప్ర‌క‌ట‌న డొల్లేన‌ని తేలిపోయింది. ఎలాగంటే.. ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్మేస్తే అమ్మేయ‌నీయండి.. మేం (బీఆర్ ఎస్‌) అధికారంలోకి వ‌చ్చాక‌.. తిరిగి కొంటాం అన్నారు. ఇది ఎంత మేర‌కు విశ్వ‌సంచాల్సిన అంశం అనేది గ‌మ‌నార్హం. ఇంట్లో దొంగ‌లు ప‌డ్డార‌నుకోండి.. వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయాలి దొంగ త‌నం జ‌ర‌గ‌కుండా కాపాడుకోవాలి. అంతేకానీ.. తాళాలు ఇచ్చేసి మీరు దొంగ‌త‌నం చేసుకోండి.. త‌ర్వాత రిక‌వ‌రీ చేసుకుంటాం అంటే బాగుంటుందా?

ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్య‌లు కూడా ఇలానే ఉన్నాయ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ క‌ర‌ణ చేయ‌కుండా అడ్డుకునేందుకు ఒక్క ప్ర‌య‌త్నం చేయ‌ని కేసీఆర్‌.. త‌ర్వాత కొంటాన‌ని చెబుతున్నారు. అంటే.. మోడీని ఇప్పుడు నిలువ‌రించే శ‌క్తి లేద‌ని స్ఫ‌ష్ట‌మ‌వుతోంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, దేశంలో 70 శాతం నీటి వ‌న‌రులు అందుబాటులో ఉంటే 20 శాతం వృథా అవుతోంద‌ని చెప్పారు.

తాము అధికారంలోకి వ‌స్తే.. మొత్తం వినియోగంలోకి తెస్తామ‌న్నారు. కానీ.. ఏపీ తెలంగాణ ల మ‌ధ్యే జ‌ల‌వ‌న‌రుల విష‌యంలో స‌ర్దుబాటు లేన‌ప్పుడు.. దేశం మొత్తాన్ని ఎలా గాడిలో పెడ‌తారో.. కేసీఆర్ చెప్పాలి. ఏదేమైనా.. మోడీని అడ్డుకోవాల‌న్న తాప‌త్ర‌యం ఉన్న‌ప్ప‌టికీ ధైర్యం క‌నిపించ‌డం లేద‌ని.. మేధావి వ‌ర్గాలు చెబుతున్నాయి.