ప‌వ‌న్ ముందు అలీ ఎంత‌…? వైసీపీ ఏం చేస్తోంది…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అవ‌కాశం ఇస్తే..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పైనే పోటీ చేస్తాన‌ని సీనియ‌ర్ హాస్య న‌టుడు, వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా విభాగానికి స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్న అలీ ప్ర‌క‌టించారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇది సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నే అనుకోవాలి. ఎందుకంటే.. ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని కొన్నాళ్లు చ‌ర్చ జ‌రిగింది. అయితే.. అది జ‌ర‌గ‌లేదు. ఈలోగా ఆయ‌న‌ను స‌ల‌హాదారుగా నియ‌మించారు.

అయితే.. అనూహ్యంగా ఇప్పుడు అలీ టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిసిపోయింది. ఆయ‌న మ‌నసులో ఉందో.. లేక అధి ష్టాన‌మే చెప్పిందో .. లేక అధిష్టానంతో త‌నే చెప్పారో తెలియ‌దు కానీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించ‌డం.. మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. అది కూడా ప‌వ‌న్‌పైనే కావ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. దీనిని కొంత లోతుగా ప‌రిశీలిస్తే.. వైసీపీ అధినేత అలీకి అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో చూద్దాం. ఇది కూడా ఆస‌క్తే క‌దా!!

ప‌వ‌న్ పోటీ చేస్తార‌ని ఇప్పుడు ప్ర‌చారంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు నాలుగు. ఒక‌టి పిఠాపురం, రెండు తిరుప‌తి, మూడు మ‌రోసా రి గాజువాక‌, నాలుగు అనంత‌పురం అర్బ‌న్‌. అయితే.. ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మైనారిటీ ఓట్లు పెద్ద‌గా లేవు. పైగా కాపుల‌కు కొట్టిన పిండి వంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అదేస‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం కూడా ఎక్కువ‌గా ఉన్న అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం ఉంది.

ఈ నేప‌థ్యంలో అలీ ఇక్క‌డ పోటీ చేసినా.. ప్ర‌భావం చూపించ‌డం క‌ష్ట‌మే. అలీని ఇప్ప‌టికీ.. క‌మెడియ‌న్‌గానే ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఆయ‌న‌ను సంపూర్ణ రాజ‌కీయ నేత‌గా విశ్వ‌సిస్తే.. అప్పుడు ఆయ‌న గెలుస్తార‌నే భావ‌న ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రిలో అలీ వైసీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. అయితే.. ఇక్క‌డ రూర‌ల్‌, సిటీ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

గ‌తంలో గుంటూరు వెస్ట్‌లోనూ ఆయ‌న ప్ర‌చారం చేశారు. ఇక్క‌డ కూడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. అలీ ప్ర‌చారం ప‌నికిరాలేద‌నే చెప్పాలి. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో బ‌ల‌మైన ప‌వ‌న్ ముందు .. పోటీ చేస్తే.. అలీ తేలిపోవ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అలా కాకుండా.. మైనార్టీ వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం అయితే.. కొంత ఫ‌ర్వాలేద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.