బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడికి ఫస్ట్ టార్గెట్


ఖమ్మంలో జనవరి 18న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల సీఎంలు ఈ సభకు రానున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్.. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ సభకు వస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు నాయకులూ హాజరువుతున్న ఈ సభను కేసీఆర్, బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. వంద ఎకరాలలో నిర్వహిస్తున్న ఈ సభకు 5 లక్షల మందిని తీసుకురావాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం కాగా… అందులో లక్ష మందిని ఏపీ నుంచి తేవాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు టార్గెట్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

5 లక్షల మందితో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు 4 లక్షల మంది తెలంగాణ నుంచి హాజరైతే మరో లక్ష మందిని ఏపీ నుంచి తేవాలని తోటకు కేసీఆర్ సూచించారట. ఆర్థికంగా సాయం అవసరమైతే బీఆర్ఎస్ నుంచి సాయం అందుతుందని పార్టీ పెద్దలు చెప్పడంతో తోట అందుకు సిద్ధపడినట్లు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఏపీ బీఆర్ఎస్‌లో తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికీ లక్షల మందితో సభలు నిర్వహించిన అనుభవం కానీ.. లక్షల మంది జనాన్ని సమీకరించిన అనుభవం కానీ లేవు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన ఫస్ట్ టార్గెట్‌ను తోట రీచ్ కావడం అనుమానమే అంటున్నారు.

ఖమ్మంకు సమీపంలోని ఆంధ్ర ప్రాంతాలలో తోట చంద్రశేఖర్‌కు ఏమంత పట్టు లేదు. ఇటీవల కాలంలో ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోవడం, స్థానిక నేతలతోనూ సంబంధాలు అంతంతమాత్రం కావడంతో ఏపీ నుంచి లక్ష మందిని తీసుకెళ్లడం కష్టమేనంటున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ సభ బాధ్యతలు చూస్తున్న హరీశ్ రావు‌కు కూడా ఈ విషయం తెలుసని.. 100 ఎకరాల స్థలంలో జనం ఎక్కడా పల్చగా కనిపించకుండా ఆయన జనసమీకరణ బాధ్యతలు చూసుకుంటున్నారట. తోటపై పెద్దగా నమ్మకం పెట్టుకోకుండా తెలంగాణ నుంచి, ఖమ్మం పక్కన ఛత్తీస్‌గఢ్ నుంచి కొందరిని తరలించేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.