ఆడుకోండ‌మ్మా.. ఐపీఎల్ ఆడుకోండి

అనుకున్న‌దే అయింది. ఈ ఏడాది అక్టోబ‌రు 18 నుంచి ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గాల్సిన మెగా క్రికెట్‌ ఈవెంట్‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డింది. ఆ టోర్నీ ఈ ఏడాది జ‌ర‌గ‌బోద‌ని ఎట్ట‌కేల‌కు ఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అసాధ్య‌మ‌ని ఎప్పుడో తేలిపోయింది. కానీ ఐసీసీ మాత్రం ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంది. ఐసీసీ ఛైర్మ‌న్‌గా మొన్న‌టిదాకా కొన‌సాగిన శ‌శాంక్ మ‌నోహ‌ర్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ నిర్ణ‌యాన్ని వాయిదా వేయించాడ‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఐతే ఇటీవ‌లే అత‌ను ప‌ద‌వి నుంచి దిగిపోవ‌డం.. సోమ‌వారం నిర్వ‌హించిన బోర్డు స‌మావేశంలో ప్ర‌పంచ‌క‌ప్‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగాయి.

టీ20 ప్రపంచ‌క‌ప్ వాయిదా అని అధికారికంగా తేలిపోతే.. ఐపీఎల్‌కు స‌న్నాహాలు చేసుకుందామ‌ని బీసీసీఐ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ విష‌య‌మై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ఏటా వేస‌విలో జ‌రిగే ఈ లీగ్‌.. క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇండియాలో అయితే రాబోయే నెల‌ల్లో కూడా ఐపీఎల్ నిర్వ‌హించే అవ‌కాశాలు లేవు. క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉండి, వ‌స‌తుల‌కు లోటు లేని దేశం అంటే దుబాయే. 2014లో ఎన్నిక‌ల కార‌ణంగా అక్క‌డ కొన్ని మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించారు. ఈ ఏడాది అక్క‌డ పూర్తి ఐపీఎల్‌ను నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది. ఐతే ఎప్ప‌ట్లా 60 మ్యాచ్‌లు కాకుండా సంఖ్య త‌గ్గించే అవ‌కాశ‌ముంది. సెప్టెంబ‌రు చివ‌రి నుంచి న‌వంబ‌రు తొలి వారం వ‌ర‌కు దుబాయ్ వేదిక‌గా ఐపీఎల్ నిర్వ‌హిస్తారని అంటున్నారు. ఐతే ఇండియా జ‌ర‌క్క‌పోయినా.. లీగ్‌ ఆల‌స్య‌మైనా.. మ్యాచ్‌లు త‌గ్గినా.. ఐపీఎల్ అయితే జ‌రుగుతుండ‌టం క్రికెట్ అభిమానుల‌కు సంతోషాన్నిచ్చే విష‌య‌మే.