వైసీపీ ప‌త‌నాన్ని క‌ళ్లారా చూస్తారు: నాగ‌బాబు

శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థలంలో జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ‘యువ‌శ‌క్తి’ స‌భ‌లో పార్టీ కీల‌క నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ పతనాన్ని జనం కళ్లారా చూస్తారని అన్నారు. ప్ర‌స్తుతం అతి తక్కువ మంది యువతే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భ‌విష్య‌త్తులో పెద్ద ఎత్తున‌ యువత రాజ‌కీయాల్లోకి రాకపోతే పాలిటిక్స్‌లోకి దుర్మార్గులు వ‌చ్చి రాజ్యమేలుతారని ప‌రోక్షంగా వైసీపీపై విరుచుకుప‌డ్డారు.

జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద నిర్వహించిన ‘యువశక్తి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పని చేస్తానన్నారు. వైసీపీ నేతలు, సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నా రని నాగ‌బాబు దుయ్య‌బ‌ట్టారు.

ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందని నాగ‌బాబు విరుచుకుప‌డ్డారు. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల‌ను అడ్డుకుంటున్నార‌ని.. పింఛ‌న్లు తీసేస్తున్నార‌ని.. ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నార‌ని.. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని తాను ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ప్ర‌భుత్వ‌ పతనాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు.

కాగా, రాష్ట్రంలో.. ఎన్నడూ లేనంతగా యువశక్తి నిర్వీర్యమవుతున్న దుస్థితి.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిపై.. నాగ‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తొలుత 100 మంది యువతీ యువకుల సమస్యలు, సూచనలను బహిరంగ సభ ద్వారా వినిపించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ప్రశ్నిస్తున్న యువతపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న జనసేన నాయకులు.. అలాంటివారికి యువశక్తి సభ వేదికగా భ‌రోసా ల‌భిస్తుంద‌న్నారు.