ఆర్జీవీ.. రాంగ్ టైమింగ్ అమ్మా

కొన్నేళ్ల ముందు రామ్ గోపాల్ వర్మను చూస్తే రాజకీయాలతో తనకే సంబంధం లేనట్లు.. ఏ నాయకుడి మీదైనా ఎలాంటి కామెంట్ అయినా చేసే దమ్మున్నట్లుగా కనిపించేవాడు. కానీ ఒక దశ తర్వాత సెలెక్టివ్‌గా కొందరికి ఎలివేషన్లు ఇవ్వడం, కొందరిని విమర్శించడం చేశాడు. తాను అన్నిటికీ అతీతుడిని అన్నట్లుగా ఉండే వర్మ.. వైసీపీ నేతల ఫండింగ్‌తో ఒక పథకం ప్రకారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ లాంటి సినిమాలు తీసిన విషయం టీడీపీ శ్రేణులకు కొంచెం ఆలస్యంగా.. డ్యామేజ్ అంతా జరిగాక కానీ బోధపడలేదు.

ఐతే వర్మను జనం అంతో ఇంతో నమ్ముతున్న రోజుల్లో వచ్చింది కాబట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కొంత వర్కవుట్ అయింది, టీడీపీకి డ్యామేజ్ కూడా జరిగింది. కానీ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఓవైపు వర్మ క్రెడిబిలిటీ పూర్తిగా పడిపోయింది. ఇంకో వైపు అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైసీపీ గ్రాఫ్ పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత మామూలుగా లేదు. వర్మ క్రెడిబిలిటీ జీరో అయిపోయింది.

ఇలాంటి టైంలో వర్మ ఒక పొలిటికల్ కామెంట్ చేసి వార్తల్లోకి వచ్చాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో వర్మ ఒక ట్వీట్ పెట్టాడు. “కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు. కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళు”.,. ఇదీ వర్మ లేటెస్ట్ ట్వీట్. సడెన్‌గా చూస్తే ఇది ఏ అంబటి రాంబాబో, గుడివాడ అమర్‌నాథ్ లాంటి వైసీపీ నేతలో పెట్టిన ట్వీట్ అనుకుంటారు. ఇన్నాళ్లూ ఇన్ డైరెక్ట్‌గా టీడీపీ, జనసేన మీద కౌంటర్లు వేసేవాడు. సినిమాలు తీసేవాడు కానీ.. వర్మ ఇంత ఏకపక్షంగా వైసీపీ ప్రతినిధిలాగా ట్వీట్ వేయడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.

ఈ దెబ్బతో తాను వైసీపీ భజనపరుడినని ముసుగు తీసి చెప్పుకున్నట్లయింది. కానీ వర్మ ఈ ట్వీట్ వేసిన టైమింగ్ మాత్రం రాంగే. వైసీపీ మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయిన టైంలో.. టీడీపీ, జనసేన కలిస్తే తమ పని మటాష్ అని వైసీపీ వాళ్లు బెంబేలెత్తిపోతున్న టైంలో.. ఆ పార్టీ వాళ్లు అభద్రతాభావంలో వేసిన ట్వీట్లకు, వర్మ ట్వీట్‌కు ఏం తేడా ఉండట్లేదు. ఇలా ఒక సైడ్ తీసుకున్నాక రేప్పొద్దున వర్మ.. టీడీపీ, జనసేనను టార్గెట్ చేస్తూ చేసే సినిమాలతో ఏం ప్రయోజనం ఉంటుందసలు?