ఏపీలో ముందస్తు ముచ్చట

Jagan Mohan Reddy Serious On His MLAs

ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు విశాఖ నుంచి హైదరాబాద్ వరకు ఎవరిని పలుకరించినా ఇదే ప్రశ్న వేస్తున్నారు. .సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటి నుంచి రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.

ప్రధాని మోదీని జగన్ కలిసినప్పుడు నేరుగా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు అందుకు కేంద్రం సహకారం తీసుకోవాలనుకుంటున్నట్లు జగన్ చెప్పారట. అయితే మోదీ మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారట. బాబూ మీ ఇష్టం.. మీరే ఆలోచించుకోవాలి అన్నారట. జగన్ కోరిన ఆశీస్సులు ఇచ్చేందుకు మాత్రం ఆయన ఆసక్తి చూపడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి…

జగన్ ఎందుకు పర్మీషన్ అడుగుతున్నారు..

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఎన్నికల కమిషన్ సహకరించాలి. అంటే కేంద్ర పెద్దలు అందుకు పచ్చజెండా ఊపాలి. లేని పక్షంలో తిప్పలు తప్పవు, గవర్నర్ ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయాలని కోరిన తర్వాత కేంద్రం అడ్డం తిరగాలనుకుంటే జగన్ ను ఎవరూ కాపాడలేదు. ఆసెంబ్లీ రద్దయిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించి ఆరు నెలల పాటు జాప్యం చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపు అధికార పార్టీని ఛిన్నాభిన్నం చేసే వ్యూహాలను రచించే అవకాశం కేంద్రంలోని అధికార పార్టీకి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అనుకున్న సమయానికి ముందస్తు ఎన్నికలు జరగకపోతే.. వాళ్లకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఈసీ అడ్డు తగిలింది. దానితో జరిగిన నష్టమేంటో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రాన్ని వేడుకున్నారు..

ఎందుకు ముందస్తు ఎన్నికలు !
జగన్ ముందస్తు ఎన్నికలు ఎందుకు కోరుకుంటున్నారన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు వైసీపీ పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.గడప గడపకు కార్యక్రమంలో నిత్యం నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలను జనం గుక్కతిప్పుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎమ్మెల్యేల్లోనే జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది.తమ బాధలను సీఎం అర్థం చేసుకోవడం లేదని,జనంలోకి వెళితే వాళ్లు తిడుతున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. దానితో వై నాట్ 175 సంగతి దేవుడెరుగు.. ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడే జారిపోయే ప్రమాదం ఉంది. పైగా చంద్రబాబు రోజురోజుకు దూసుకుపోతున్నారు. షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఇక తమ పార్టీ శంకరగిరి మాన్యాలు పట్టుకు పోవాల్సిందేనని జగన్ భయపడుతున్నారు. చంద్రబాబు దూకుడును ఆపాలంటే ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలి. ఒక్క సారి ఎన్నికలు పూర్తయి, వైసీపీ గెలిస్తే ఇక ఐదేళ్ల వరకు ఢోకా ఉండదు.. చంద్రబాబు బెంగ తమకు ఉండదని జగన్ ఆలోచిస్తున్నారు..

ఏప్రిల్‌లో అసెంబ్లీ రద్దు

ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది. జీతాలు, పెన్షన్లు అందక జనం తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. వారి ఆగ్రహం వ్యతిరేక ఓటుగా మారకముందే ఎన్నికలు జరిగిపోతే హాయిగా ఉండొచ్చన్నది జగన్ ప్లాన్. అందుకే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో అసెంబ్లీని రద్దు చేస్తే.. మే చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. ఏడాది ముందే ఎన్నికలు జరుపుకుని గట్టెక్కినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నారు. దానికి బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనని వైసీపీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి…