ప్ర‌జ‌లు మ‌న ప్ర‌భుత్వాన్ని న‌మ్మ‌డం లేదు.. వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ సొంత‌ ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. ఏ మొహం పెట్టుకుని ఓట్ల‌డ‌గాలి? అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఆది నుంచి కూడా ఆనం తీరు సెప‌రేటుగానే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే.. దీనిలోనూ నిజం ఉండ‌డం..ఆ య‌న మాట‌ల వెనుక‌.. వాస్త‌వం ఉండ‌డంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఏమీ అన‌లేని, చేయ‌లేని ప‌రిస్థితి ఉంటోంది.

 బుధవారం రాపూరులో వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్ల సమావేశంలో ఆనం పాల్గొని ప్రసంగించారు. రోడ్లు గుంతలు పూడ్చలేకపోతున్నామని.. తాగడానికి నీళ్లు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద నిధులు ఇస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని అడగాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు ఏమైనా కట్టామా? పనైనా మొదలుపెట్టామా? శంకుస్థాపన ఏమన్నా చేసామా? ఏమని ఓట్లు అడగాలని అన్నారు.

పెన్షన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా? గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘ఇల్లు కడతానన్నావ్… లే అవుట్లు వేశాం. ఇల్లులేమైనా కట్టామా?’’ అంటూ జగన్ సర్కార్‌పై ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎస్ఎస్‌ కెనాల్‌ కడతామని ఎన్నికల వేల హామీ ఇచ్చామన్న ఆనం.. మూడున్నరేళ్లయినా కనీసం కెనాల్‌ గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎస్ఎస్‌ కెనాల్‌ గురించి సీఎం జగన్‌కు ఎన్నోసార్లు చెప్పామని.. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించామన్నారు.

ఎస్ఎస్‌ కెనాల్‌ గురించి చీఫ్‌ ఇంజినీర్ల భేటీలోనూ కోరాం అయినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని మండిపడ్డారు. కంటి ముందు నీళ్లున్నాయని సంతోషపడటమే తప్ప నీళ్లు తాగలేని పరిస్థితి అని ఆందోళన చెందారు. ఇక్కడి నీళ్లు తాగగలమనే ఆత్మవిశ్వాసం ప్రజలకు లేదని విమర్శించారు.

కండలేరు దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయామని మండిపడ్డారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్‌ కలను నెరవేర్చలేకపోయామని.. ఆయన కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని ధ్వజమెత్తారు. ప్రజలు ప్రస్తుతం నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరని.. అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం అని ఆనం మండిపడ్డారు.