‘ప్రెస్ మీట్లు పెట్టి బాగా తిట్టండి’.. అధికారులకు జగన్ సూచన

ఏపీ సీఎం Jagan Mohan Reddy కి ఏమైందో ఏమో కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగుతో పాటు సంస్కృతం తిట్లలో నంబర్ 1 అనిపించుకునే నేతలను తన వద్ద ఉంచుకున్న జగన్.. వారు చాలరన్నట్లుగా అధికారులనూ తిట్ల దండకాలు అందుకోమంటున్నారు. తాజాగా ఆయన.. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసేవారిని తిట్టాలని అధికారులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు తగ్గించేస్తున్నారంటూ అన్ని నియోజకవర్గాల నుంచి వినిపిస్తోంది. దీనిపై వృద్ధులు గగ్గోలు పెడుతున్న వీడియోల మీడియాలో, సోసల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సీఎం.. అందుకు బదులుగా ఈ ప్రచారం చేస్తున్నవారిని తిట్టాలని అధికారులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నాని.. పింఛన్లు తొలగిస్తున్నవాటిలో జెన్యూస్ కేసులుంటే పరిశీలించి పింఛన్లు ఇవ్వాలని.. లేదంటే అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలని జగన్ అన్నారు. అలా చేస్తేనే తప్పుడు వార్తలు ఆగుతాయని ఆయన అన్నారు.

మీడియాను, ప్రతిపక్షాలను తిట్టాలని సాక్ష్యాత్తు సీఎం సూచించడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేసుకోవడం, అవకాశం ఉంటే ఇంకేదైనా చేసుకోవడం తప్పించి ఇలా మీడియాను, ప్రతిపక్షాలను తిట్టాలంటే తమవల్ల ఎలా అవుతుందని… తమకేమైనా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారా.. అసెంబ్లీకి పంపిస్తారా అంటూ కొందరు అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాగా ఏపీలో వచ్చే నెల నుంచి పింఛను రూ. 250 మేర పెంచుతుండడంతో ఆ మేరకు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి పింఛనుదారుల సంఖ్య తగ్గిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. నెలనెలా పింఛన్లకు కేటాయించే మొత్తం తగ్గకుండా పింఛనుదారుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు పింఛన్ల తొలగింపుపై విపక్సాలు, మీడియా మాత్రమే కాకుండా సొంత పార్టీ నేతల నుంచీ విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పింఛన్ల తొలగింపు వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో దీనిపై తిట్ల దండకం అందుకోవాలని సీఎం అధికారులకు సూచించడంపై సెటైర్లు పడుతున్నాయి.