రాధా రాజ‌కీయం.. టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతోందా..?

వంగ‌వీటి రాధా! ఈ పేరు చెబితే.. టీడీపీ నాయ‌కులు.. న‌వ్వాలో.. బాధ‌ప‌డాలో తెలియ‌ని పరిస్తితి ఏర్ప‌డింది. ఎందుకంటే.. రాధా.. ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఆయ‌న మ‌న‌సంతా.. టీడీపీ బ‌ద్ధ శ‌త్రువులుగా భావిస్తున్న.. చంద్ర‌బాబుపైనా.. ఆయ‌న కుటుంబంపైనా నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి Kodali Nani, ప్ర‌స్తుత ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తోనే ఉంది. వారు లేకుండా.. రాధా ఒక్క కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌డం లేదు.

ఇది టీడీపీకి మింగుడు ప‌డ‌ని చ‌ర్చ‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ విజ‌యవాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇవ్వ‌న‌ని భీష్మించ‌డంతో అలిగిన రాధాను ఏదో ఒక ర‌కంగా.. చంద్ర‌బాబు త‌న‌వైపు తిప్పుకొన్నారు. దీనికి కూడా స్వ‌లాభం ఉంది. అప్ప‌ట్లో కాపు నాయ‌కులు.. త‌మ రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మించారు. ఇది TDPకి భారీ సెగ పుట్టించింది. ఇది ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌కుండా ఉండాలంటే.. రంగా త‌న‌యుడు రాధాను తీసుకుంటే స‌రిపోతుంద‌ని అనుకున్నారు.

అయితే.. ఆ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టీడీపీకి టికెట్ ఇవ్వ‌లేదు. అయితే..పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. రాజ్య‌స‌భ‌కు కానీ.. మండ‌లికి కానీ పంపిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారంలో కి వ‌చ్చింది(చేశార‌నే టాక్ కూడా ఉంది) అయితే.. ఈ వ్యూహం ఫ‌లించ‌లేదు. కాపుల‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు గా ఉన్న చోట‌, కాపులు నాయ‌కులు పోటీ చేసిన చోట కూడా.. టీడీపీ ఓడిపోయింది.

మ‌రోవైపు.. ఇప్పుడు రాధా టీడీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌ల‌తో తిరుగుతున్నారు. ముఖ్యంగా కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తోనే ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో YCPలోకి మ‌ళ్లీ వెళ్లిపోయినా వెళ్లిపోవ‌చ్చ‌నేది ఒక దిగులు. అలాగ‌ని చ‌ర్య‌లు తీసుకుంటే.. త‌మ కుటుంబానికి అన్యాయం చేశార‌నే వాద‌న‌ను రాధా తెర‌మీద‌కి తెస్తే.. మ‌ళ్లీ 2019 ఎన్నిక‌లకు ముందున్న ప‌రిస్థితి రావొచ్చు. దీంతో టీడీపీలో రాధా ప‌రిస్థితి.. ఆ పార్టీ అధినేత‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.