ఈసారి అసెంబ్లీకి సంజ‌య్ పోటీ?!

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్‌.. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌కు అసెంబ్లీలో అడుగు పెట్టి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను నేరుగా విమ‌ర్శించే అవ‌కాశం లేకుండా పోయింద‌నే ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న పంథాను మార్చుకున్నార‌ని స‌మాచారం. అంటే.. ఈ సారి బండి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నార‌న్న‌మాట‌.

వ‌స్తే.. పార్టీకి అధికారం. లేక‌పోతే.. త‌ను గెలిచైనా.. అసెంబ్లీలో కేసీఆర్‌కు కంట్లో న‌లుసులా మారాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారట‌. ఆయ‌న‌కు ఎంతో ప్రియ‌మైన క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కీల‌క‌మైన ముథోల్ నియోజకవర్గం నుంచి బండి ఈ సారి అసెంబ్లీ బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్ర‌చారానికి ద‌న్ను.. అన్న‌ట్టుగా ఇటీవల ఆయ‌న త‌న పాద‌యాత్ర‌లో ముథోల్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సంజయ్ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపులు ఇక్క‌డ బ‌లంగా ఉండ‌డం.. సంజ‌య్‌కు క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన అంశం.

మున్నూరు కాపుల ఓట్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 46 నుంచి 50 వేల వ‌ర‌కు ఉన్నాయ‌ని బీజేపీ నేత‌లు లెక్క‌లు వేస్తున్నారు. దీంతో త‌ను క‌నుక బ‌రిలో నిలిస్తే.. ఈ సామాజిక వర్గం అంతా త‌న‌కు అండ‌గా నిలుస్తుంద‌ని బండి అప్పుడే క‌ల‌లు క‌నేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు తెగ గుస‌గుస‌లాడుతున్నాయి. మ‌రోవైపు.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో హిందువులు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. వీరంతా కూడా త‌న‌కు అండ‌గా నిలుస్తార‌నేది బండికి ఉన్న మ‌రో లెక్క‌. దీంతో ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఇక‌, ఇక్క‌డే మ‌రో విష‌యం చెప్పుకోవాలి. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత జ‌రిగిన రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా ఇక్క‌డ నుంచి బ‌రిలోనిలిచిన ర‌మాదేవి.. భారీ ఓట్లే ద‌క్కించుకున్నారు. అంతేకాదు.. అధికార టీఆర్ఎస్ కు కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. దీంతో బీజేపీకి సానుకూల ప‌రిణామాలు ఉన్నాయ‌ని గ్ర‌హించిన సంజ‌య్‌.. ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి సంజ‌య్ అభీష్టాన్ని పార్టీ అధిష్టానం ఏమేర‌కు అంగీక‌రిస్తుందో చూడాలి.