జగన్ ను మరో సారి హెచ్చరించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన జగన్ ప్రభుత్వం రోజురోజుకు అప్పుల భారాన్ని పెంచుతోంది. సంక్షేమ పథకాల..ఇతర లెక్కలు చూపిస్తూ ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ సంగతి తెలియజేశారు.

బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా ప్రస్తుతం 3,98,903.6 కోట్ల కు చేరింది. పైగా ఏటా బడ్జెట్లో అప్పుల శాతం కూడా పెరిగిపోతోంది. 2017-18లో గతంతో పోలిస్తే -9.8 శాతం తగ్గితే 2020 21నాటికి అది 17.1 శాతానికి పెరిగింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతోంది.

తెలుగుదేశం అధికారంలోకొచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పులు 42.3% ఉండగా ఆ తరువాత భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది. 2015 లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా 2021 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 36.5% గా నమోదైంది. బడ్జెట్ లో చూపించిన అప్పులు కంటే బడ్జెటేతర అప్పులు ఎక్కువగా ఉన్నాయని అది సహేతుకం కాదని కేంద్రం హెచ్చరిస్తోంది.

కొత్త అప్పులు పుట్టక ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అందిన అప్పులు కూడా పాత అప్పులకు వడ్డీ కట్టేందుకు సరిపోతోంది. దానితో ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రతీ నెల ఇబ్బందులు ఎదరువుతున్నాయి. నెల నెల వేతనాలు, పెన్షన్లకు 5,500 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఒకటో తారీఖున ప్రభుత్వం దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో కొందరికి జీతాలు ఇచ్చి.. మరికొందరికి ఆపాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని అధికార వర్గాలు అంటున్నాయి…..