ఆంధ్రప్రదేశ్ జనం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదా ?

జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితి…(బీఆర్ఎస్)ను స్థాపించిన కేసీఆర్ …ఏపీ వైపు చూస్తున్నారు. ఢిల్లీలో కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం… ఇకపై పార్టీ విస్తరణకు ప్రాధాన్యమిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడంపైనే తొలుత దృష్టి పెడతారని పార్టీ నేతలు చెబుతున్నారు.

సంక్రాంతి తర్వాత ఏపీ వైపుకు బీఆర్ఎస్ కదులుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి శ్రీనివాస యాదవ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ఏపీలో ఉన్న పరిచయాలు, బంధుత్వాలు బీఆర్ఎస్ కు ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నారు. ఒక పక్క యనమల రామకృష్ణుడు మరో పక్క పుట్టా సుధాకర్ యాదవ్ లు తలసానికి బంధువులు కావడంతో వారి ద్వారా బీఆర్ఎస్ ను అభివృద్ధి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు..

ఏపీలో ఎవరైనా పట్టించుకున్నారా…

కేసీఆర్ పార్టీ పెడతానని చెప్పినప్పుడు ఊరు పేరు లేని ఒకరిద్దరూ మాత్రమే స్పందించారు. రెండు పర్యాయాలు విజయవాడలో ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలు అంతటితో ఆగిపోయాయి. బీఆర్ఎస్ లో చేరతామని గానీ, బీఆర్ఎస్ కు మద్దతిస్తామని గానీ ఏ ఒక్క నాయకుడు ప్రకటించలేదు. రాజకీయ నిరుద్యోగులు సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్న దాఖలాలు లేవు.
ఎవైరనా నాయకులతో తలసాని చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు రావడం లేదు..

ఆ ప్రశ్నలకు బదులేది..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ చాలా మాటలు మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దుల్లో గోడ కడతామన్నారు. ఏపీ ప్రజల ఆహార అలవాట్లను విమర్శించారు. చివరకు బిర్యానీని కూడా ఎగతాళి చేశారు. కొన్ని సందర్భాల్లో ఆన్ పార్లమంటరీ మాటలు కూడా మాట్లాడారు. వాటన్నింటికీ కేసీఆర్ ఏపీ వెళ్లినప్పుడు సారీ చెబుతారో లేదో చూడాలి..

విభజన సమస్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సవాలక్ష సమస్యలతో శతమతమవుతోంది. కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ వివాదం ఒక కొలిక్కి రావడం లేదు. ఆస్తుల వ్యవహారంపై కూడా తెలంగాణ స్పందించడం లేదు. లక్షా 42 వేల కోట్ల ఆస్తుల పంపిణీకి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. అందులో 91 శాతం ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి. చంద్రబాబు హైదారాబాద్ ను అభివృద్ధి చేసే కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారని వాదించే వారూ ఉన్నారు. మరి ఏపీలో అడుగుపెట్టినప్పుడే విభజన వివాదాలను పరిష్కారానికి కేసీఆర్ ఏదోక మాట చెప్పాల్సిందే..

అమరావతికి మద్దతేనా…

సంక్రాంతి తర్వాత ఏపీలో కార్యాలయ ఏర్పాటు, బహిరంగ సభ ఉంటుందంటున్నారు. విజయవాడలో కార్యాలయం, గుంటూరు – విజయవాడ మధ్య బహిరంగ సభ ఉండొచ్చు. ఇదీ అమరావతి రాజధానికి కేసీఆర్ ఇస్తున్న మద్దతులో భాగమేనని కొందరి వాదన. ఆ మాట కేసీఆర్ వెంట రావాలి. మరి జగన్ ను తన ఆప్తమిత్రుడిగా భావించే కేసీఆర్.. మూడు రాజధానుల ప్రతిపాదనను బహిరంగంగా వ్యతిరేకిస్తారో లేదో కూడా చూడాలి.. ఏం చేస్తారో మరి….